పెట్రేగిన ఉగ్రవాదులు: సిఆర్పీఎఫ్‌ వాహనంపై కాల్పులు

శ్రీనగర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. గురువారం ఉదయం లాజీబాల్‌ చౌక్‌ వద్ద సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) వాహనంపై మెరుపుదాడికి దిగారు. గుర్తు తెలియని ఉగ్రవాదులు బస్సును చుట్టుముట్టి కాల్పులు జరపడంతో ఐదుగురు సీఆర్పీఎఫ్‌ సిబ్బంది గాయపడినట్టు స్థానిక పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఉదయం 8.45 ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ 96వ బెటాలియన్‌కి చెందిన బస్సుపై కాల్పులకు తెగబడినట్టు తెలిపారు.

గాయపడిన వారిని స్థానిక జిల్లా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామనీ… వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని పేర్కొన్నారు. కాగా సీఆర్పీఎఫ్‌ వాహనంపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం సైనికులు విస్తృత గాలింపు చేపట్టారు. అలాగే పోలీసులు అంతటా అప్రమత్తం అయ్యారు.