పెళ్లి కోసం ఇటలీ బయలుదేరిన బాలీవుడ్‌ జంట

ముంబయి,నవంబర్‌10(జ‌నంసాక్షి): బాలీవుడ్‌ తారలు పెళ్లి చేసుకోబోతున్న శుభ తరుణం ఆసన్నమైంది. తామిద్దరం వివాహం చేసుకోబోతున్నామని ఈ జంట గత నెలలోనే ప్రకటించింది. నవంబరు 14, 15 తేదీల్లో వివాహం ఉంటుందని తెలిపారు. ఇటలీలోని లేక్‌ కోమో వీరి వివాహానికి వేదిక కానుంది. పెళ్లికి ఇంకా నాలుగు రోజులే సమయం ఉండడంతో దీపిక, రణ్‌వీర్‌ జంట ఇప్పుడు ఇటలీకి పయనమైంది. శనివారం తెల్లవారు జామున ఇద్దరూ విడివిడిగా తెల్లని దుస్తుల్లో ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉన్నట్టుండి ఈ జంట అభిమానుల కంట పడడంతో అంతా ఆశ్చర్యపోయారు. అభిమానులు, విూడియా గుమిగూడడంతో చిరునవ్వుతో అందరికీ హాయ్‌ చెప్పి వెళ్లిపోయారు. అనుష్క,కోహ్లీ జంట కూడా ఇటలీలోనే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.