పేదలకు ఉచిత న్యాయం-జిల్లా జడ్జి డి.రాజేష్ బాబు-

నాగర్ కర్నూల్ రూరల్ నవంబర్ 10(జనంసాక్షి):ప్రజలు,విద్యార్థులకు న్యాయమైన హక్కులు చట్ట ప్రకారం లభించాలంటే ముందుగా వాటిపై అవగాహన పెరగాలని నాగర్ కర్నూల్ జిల్లా జడ్జి డి.రాజేష్ బాబు అన్నారు.గురువారం బిజినపల్లి మండల పరిధిలోని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో చదువుకుంటున్న వ్యవసాయ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని మండల్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి డి.రాజేష్ బాబు ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఆర్థికంగా,సామాజికంగా వెనుకబడిన వర్గాలకు,నిరక్షరాస్యులకు,అంగవైకల్యం ఉన్న వారికి ఉచిత న్యాయ సహాయం మండల్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో అందిస్తామని ఆయన తెలిపారు.ప్రతి మనిషికి న్యాయపరమైన అవసరం ప్రతి దిశలోనూ ఉంటుందన్నారు.రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు పొందడం మన బాధ్యత అని గుర్తు చేశారు.విద్యార్థులు తమ మేజాశక్తితో రైతులకు నూతన వంగడాలను కనుగొని వ్యవసాయం లాభతరంగా ఉండేలా కృషి చేయాలని,రైతులకు ప్రతి అంశంపై అవగాహన పెంచాలన్నారు.ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సబిత మాట్లాడుతూ,మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని,వారి హక్కుల సాధనకై పోరాడాలని,మహిళా సాధికారత దిశగా సాగాలని ఆమె ఆకాంక్షించారు.మహిళలకు తల్లిదండ్రుల ఆస్తుల్లో సమాన హక్కులను రాజ్యాంగం కల్పించిందన్నారు.ఈ అవకాశాన్ని ప్రతి మహిళ అందిపుచ్చుకోవాలని కోరారు.మహిళలు చట్టాలను అందిపుచ్చుకోవాలని,సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాలన్నారు.70శాతం అమ్మాయిలు వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నందుకు ఆమె విద్యార్థులను అభినందించారు.మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించిన విధంగా కలలను కని సహకారం చేసుకోవాలని కోరారు.ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కే స్వరూప మాట్లాడుతూ,బాలికలు బాల్య వివాహాల పై జాగ్రత్తగా ఉండాలని,చదువు పట్ల శ్రద్ధ వహించాలని,అలాగే యూటీ జింగ్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండి అలాంటి వారిపై పోలీసుల దృష్టికి తీసుకురావాలనీ ఆమె తెలిపారు.వరకట్నపు వేధింపుల నుండి రక్షణ పొందేందుకు రాజ్యాంగం అనేక మహిళలకు హక్కులను కల్పించిందన్నారు.కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించినందుకు న్యాయమూర్తులకు కళాశాల యాజమాన్యం శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో బార్ సోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా,కళాశాల ఏడిఆర్ గోవర్ధన్,వ్యవసాయ పరిశోధన కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్.పుష్పవతి,డాక్టర్.సుజాత,డాక్టర్.అరుణ,ప్రభుత్వ న్యాయవాది శ్యాంప్రసాద్,న్యాయవాదులు శివశంకర్,బంగారయ్య,రామ్ లక్ష్మణ్,రామ్ చందర్,రామకృష్ణ యాదవ్,సత్యనారాయణ,జిల్లా కోర్టు పర్యవేక్షకులు కేశవరెడ్డి,విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.