పోలింగ్ శాతం పెరిగింది
– 45 శాతం ఓటింగ్
– జనార్ధన్ రెడ్డి
హైదరాబాద్,ఫిబ్రవరి 2(జనంసాక్షి): చివరి వరకూ తమకు అందిన సమాచారం ప్రకారం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ నమోదు అయినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ ఇంకా రెండు లేదా మూడు శాతం ఓటింగ్ పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో కంటే స్వలంగా ఓటింగ్ శాతం పెరిగినట్లు చెప్పారు. 2 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ పెట్టామని.. లైవ్ వెబ్ కాస్టింగ్ పెట్టడం వల్ల ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదని చెప్పారు. ఎక్కడ ఏ చిన్న సమాచారం వచ్చినా పోలీసులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. గ్రేటర్ పరిధిలో ఎక్కడా హింసాత్మక ఘటనలు, పోలింగ్ బూత్లను ఆక్రమించడం జరగలేదని కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఉదయం పోలింగ్ మొదలైన అరగంటలో కేవలం ఎనిమిది ఈవీఎంలు మొరాయించాయని, అయితే పది నిమిషాల్లోనే వాటిని సరిచేయడం జరిగిందన్నారు. గ్రేటర్ ఎన్నికల పక్రియ బాగానే జరిగిందని, ఒకటి, రెండు చోట్ల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఆయన తెలిపారు. ఎంఐఎం, కాంగ్రెస్ గొడవపై ప్రిసైడింగ్ అధికారి నుంచి వివరాలు తెలుసుకుంటామన్నారు. పూర్తి వివరాలను ఎన్నికల కమిషన్కు నివేదిస్తామని కమిషనర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడా బూత్ క్యాప్చరింగ్ గానీ, రిగ్గింగ్ గానీ జరగలేదని తెలిపారు. 4 టెండర్ ఓట్లు మాత్రమే నమోదైనట్టు వెల్లడించారు. వెబ్ కాస్టింగ్కి పోలీసు శాఖ నుంచి సహకారం అందిందని వివరించారు. రెండు మూడు సంఘటనలు జరిగినా అవి పోలింగ్ కేంద్రాలకు వంద విూటర్ల అవతల జరిగినవేనని తెలిపారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తీవ్ర ప్రయత్నం చేశామని వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారి నాగిరెడ్డి తెలిపారు. గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగినట్లు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా క్యూలైన్లో వేచి ఉన్నవారికి ఓటువేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.