ప్రజస్వామ్యానికి భారత్‌ పుట్టినిల్లు

– నూతన పార్లమెంటు భవనానికి మోదీ శంకుస్థాపన

దిల్లీ,డిసెంబరు 10 (జనంసాక్షి): ప్రస్తుత పార్లమెంట్‌ భవనం స్వాతంత్య్రం తర్వాత దేశానికి దశదిశ నిర్దేశించిందని, అలాగే నూతన పార్లమెంట్‌ భవనం ఆత్మనిర్భర్‌ భారత్‌కు దిశానిర్దేశం చేయనుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తౌెన సందర్భానికి గుర్తుగా ఈ భవనం నిలవనుందని చెప్పారు. దేశ ప్రజలందరూ గర్వించాల్సిన క్షణమని అన్నారు. నూతన పార్లమెంట్‌ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ ప్రసంగించారు.”ఈ రోజు భారతీయులకు చరిత్రాత్మక దినం. భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. 130 కోట్ల మంది భారతీయులు గర్వించదగ్గ సుదినం. ఇది దేశ ప్రజలందరూ కలిసి నిర్మించుకుంటున్న భవనం. స్వాతంత్య్రం వచ్చిన 75ఏళ్లు పూర్తౌెన సందర్భానికి గుర్తుగా ఈ భవనం నిలవనుంది. ప్రస్తుత పార్లమెంట్‌ భవనంలోనే భారత రాజ్యాంగ రచన జరిగింది. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, మరెందరో మహనీయులు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో రాజ్యాంగ రచన పూర్తి చేశారు. చరిత్రను గౌరవిస్తూనే వాస్తవ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు నూతన భవనానికి శంకుస్థాపన చేశాం. నూతన పార్లమెంట్‌ భవనంలో అనేక విధాలైన సౌకర్యాలు రానున్నాయి. పార్లమెంట్‌ పనితీరు మెరుగుదలకు కావాల్సిన అన్ని హంగులు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుత పార్లమెంట్‌ భవనం స్వాతంత్య్రం తర్వాత దేశానికి దశదిశా నిర్దేశించింది. నూతన పార్లమెంట్‌ భవనం ఆత్మనిర్భర్‌ భారత్‌కు దిశా నిర్దేశం చేయనుంది” అని ప్రధాని మోదీ అన్నారు.”స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ప్రజాస్వామ్యం ఓ విఫల ప్రయత్నం అని చాలా మంది అన్నారు. ఇప్పుడు వాళ్లందరూ చూస్తూ ఉండగానే ప్రజాస్వామ్య భారతం అద్భుతంగా పురోగమిస్తోంది. మాగ్నా కార్టా కంటే ముందే భారతదేశంలో హక్కుల కోసం ప్రయ్నతాలు జరిగాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి అంతకు ముందు నుంచే ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. దేశ ప్రజాస్వామ్య ప్రస్థానానికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. అప్పటి నుంచే ప్రజాస్వామ్య ప్రయాణానికి బాటలు వేశారు. 10వ శతాబ్దంలో తమిళనాడులోని ఓ గ్రామంలో పంచాయతీ వ్యవస్థ గురించి సవివరంగా పేర్కొన్నారు. రుగ్వేదంలో కూడా ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావన ఉంది. భారతదేశం సమాజ మూలాల్లోనే ప్రజాస్వామ్యం విధానాలు ఉన్నాయి. భారత దేశ తత్వ చింతన అంతా ప్రజాస్వామ్యం ఆధారంగానే సాగింది. ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలకు మన దేశం పురిటిగడ్డ. దేశ ప్రజాస్వామ్య ప్రయాణం ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా సాగుతోంది. దేశంలో ప్రతి ఎన్నికకూ ఓటింగ్‌ శాతం పెరుగుతూ వస్తోంది. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంపై మాత్రం ఎవరికీ వ్యతిరేకత లేదు. సభ లోపల, బయటా సంవాదాలు దేశం కోసమే. మన ప్రతి నిర్ణయంలో ‘దేశం మొదట’ అన్న భావనే ఉండాలి. పార్లమెంట్‌ నూతన భవనం కూడా ఒక దేవాలయమే. ఈ దేవాలయంలో ప్రాణప్రతిష్ట చేయాల్సింది రానున్న ప్రజాప్రతినిధులే” అని ప్రధాని మోదీ అన్నారు.