ప్రధాని పర్యటన రద్దు?

జ్యోతినగర్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రామగుండం పర్యటన మళ్లీ రద్దయినట్లు సమాచారం. తెలంగాణ స్టేజ్‌–1లో భాగంగా ఎన్టీపీసీ నిర్మించనున్న 800 మెగావాట్ల రెండు యూనిట్లు, గ్యాస్‌ ఆధారితంగా పునరుద్ధరిస్తున్న రామగుండం ఎరువుల కర్మాగారం పనులకు శంకుస్థాపన చేయడానికి నరేంద్రమోదీ పర్యటన ఆగస్టు 7న ఖరారైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు ప్రారంభించాయి.

ఎన్టీపీసీ పర్మనెంట్‌ టౌన్‌షిప్‌లోని మహాత్మగాంధీ క్రీడా మైదానం సమీపంలో రెండు హెలిప్యాడ్‌ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టారు. అయితే ప్రధానమంత్రి పర్యటన గజ్వేల్‌ వరకు మాత్రమే పరిమితం అవుతుందని సూచనప్రాయంగా సమాచారం అందించినట్లు తెలిసింది. గజ్వేల్‌ సమావేశంలోనే తెలంగాణ స్టేజ్‌–1 శిలాఫలకాన్ని మోడీ ఆవిష్కరిస్తారని సమాచారం. భదత్రా కారణాల రీత్యానే ప్రధాని పర్యటన రద్దయినట్లు చర్చ జరుగుతోంది.