ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దఘ్దం సిగ్గుచేటు
కాంగ్రెస్పై విరుచుకు పడ్డ నడ్డా
న్యూఢిల్లీ,అక్టోబర్26(జనంసాక్షి): కాంగ్రెస్ పాలిత పంజాబ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను తగులబెట్టడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. నెహ్రూ-గాంధీ వంశం ఏనాడూ ప్రధాని కార్యాలయాన్ని గౌరవించలేదని విమర్శించింది. ఇదే విషయాన్ని ట్విట్టర్లో పేర్కొన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను తగులబెట్టిన సంఘటనకు రాహుల్గాంధీయే ప్రధాన కారకుడని ఆరోపించారు. ‘రాహుల్ గాంధీ దర్శకత్వం వహించిన నాటకం పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని దిష్టిబొమ్మను కాల్చడం సిగ్గుచేటు. కానీ, ఇది ఊహించనిది కాదు. నెహ్రూ-గాంధీ వంశం ప్రధాని కార్యాలయాన్ని ఎన్నడూ గౌరవించలేదు. యూపీఏ సమయంలో ప్రధాని అధికారాన్ని సంస్థాగతంగా బలహీనపరచడంలో కనిపించింది’ అని జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ‘నిరాశ, సిగ్గులేని కలయికను కాంగ్రెస్ కలిగివున్నది. రాజస్థాన్లో దళిత వర్గాల ప్రజలపై జరుగుతున్న దారుణాలు జరుగుతున్నా కాంగ్రెస్ పట్టించుకున్న పాపాన పోవడంలేదు. రాజస్థాన్తో పాటు పంజాబ్లో మహిళలు సురక్షితంగా లేరని అన్నారు. పంజాబ్ మంత్రులు స్కాలర్షిప్ మోసాలకు పాల్పడుతున్నారు’ అని నడ్డా పేర్కొన్నారు. కేంద్రం యొక్క కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆదివారం జరిగిన దసరా వేడుకల సందర్భంగా పంజాబ్లోని రైతు సంస్థలు ప్రధాని మోదీ, వ్యాపార వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ‘ఇది నిన్న పంజాబ్ అంతటా జరిగింది. పంజాబ్ ప్రధాని పట్ల ఇంత కోపంగా ఉండటం విచారకరం. ఇది చాలా ప్రమాదకరమైన ఉదాహరణ. ఇది మన దేశానికి మంచిదికాడు. ప్రధాని త్వరగా రైతుల వద్దకు చేరుకొని వారి బాధలు వినాలి’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.