ప్రధాని మోడీ హత్యకు ఈ మెయిల్‌ బెదిరింపు

గుర్తించిన పోలీసుల దర్యాప్తు
న్యూదిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తామంటూ దిల్లీ పోలీస్‌ కవిూషనర్‌ అమూల్య పట్నాయక్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్‌ వచ్చింది. దీంతో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక్క లైను సందేశం మాత్రమే ఉన్న ఆ మెయిల్‌లో 2019లోని ఓ తేదీ పేర్కొని, ఆ రోజున ప్రధాని మోదీపై దాడి జరుపుతామని దుండగుడు పేర్కొన్నాడు. అయితే, ఇందుకు సంబంధించిన మిగతా వివరాలను పోలీసులు బహిర్గతం చేయలేదు. ఓ జాతీయ విూడియా పేర్కొన్న వివరాల ప్రకారం దిల్లీ పోలీస్‌ కవిూషనర్‌కు ఆ మెయిల్‌ అసోంలోని ఓ జైలు నుంచి వచ్చిందని తెలిసింది. ఈ విషయంపై నిఘా వర్గాలు కూడా అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో పలు రాష్టాల్లో బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉండడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. కాగా, మోదీని హత్య చేసేందుకు పన్నిన కుట్రకు సంబంధించి మహారాష్ట్రలోని పుణె పోలీసులకు ఓ లేఖ లభ్యమైన విషయం తెలిసిందే. జూన్‌లో పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య తరహాలోనే మోదీపై దాడి చేయాలని మావోయిస్టులు కుట్ర పన్నినట్లు అప్పట్లో పోలీసులకు తెలిసింది. భీమా కొరెగాన్‌ కేసులో ఒకరి ఇంట్లో సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఈ లేఖ లభ్యమైంది. ఈ ఘటన మరవక ముందే మోదీపై దాడి చేస్తామంటూ దుండగుడు మెయిల్‌ పంపాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.