ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌

3

– డెప్యూటీ సీఎం మహమూద్‌ అలీ

– నాగపూర్‌లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు

చెత్త నిర్వహణపై అధ్యయనం

నాగపూర్‌,జూన్‌16(జనంసాక్షి): ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ అన్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రజా ప్రతినిధుల బృందం ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ నేతృత్వంలో నాగ్‌పూర్‌లో పర్యటిస్తోంది. ఇక్కడ చెత్త నిర్వహణపై అద్యయనం చేసారు. చెత్త సేకరణ మదలు, ఉపయోగం వరకు ఉన్న వివిధ దశలను పరిశీలించారు. స్వచ్ఛహైదరాబాద్‌ లక్ష్యంలో భాగంగా దేశంలోని అత్యుత్తమ మున్సిపాలిటీల నిర్వహణను నేతల బృందం అధ్యయనం చేస్తోంది. దిల్లీలో పర్యటించిన బృందం జహంగీర్‌పురిలోని డంపింగ్‌యార్డు, ఓక్లాలోని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించింది. మంగళవారం నాగ్‌పూర్‌లో చెత్త సేకరణ, పారిశుద్ధ్యంపై అధ్యయనం చేస్తున్నారు. భాజపా శాసనసభాపక్షనేత లక్ష్మణ్‌, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు నాగ్‌పూర్‌ పర్యటన బృందంలో  పాల్గొన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాయత్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటగా హైదరాబాద్‌ను క్లీన్‌ సిటీగా మార్చనున్నారు. హైదరాబాద్‌కు చెందిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు సభ్యులుగా స్వచ్ఛహైదరాబాద్‌ కమిటీ ఏర్పాటు.  హైదరాబాద్‌ను క్లీన్‌ సిటీగా మార్చేందుకు సీఎం పట్టుదలతో ఉన్నారని అందుకే తాముపర్యటిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీల నాయకుల ఆధ్వర్యంలో పర్యటన కొనసాగుతుంది. చెత్త సేకరణ, తరలింపు, డంపింగ్‌ వంటి అంశాలపై అధ్యయనం చేసి అమలు పరిచేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం. దేశంలోనే హైదరాబాద్‌లో చెత్త సేకరణ ఎక్కువ. చెత్త రీసైక్లింగ్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి, ఇటుకలు, టైల్స్‌ వంటి వస్తువుల తయారీకి పరిశ్రమల ఏర్పాటు. వృథాగా ఏ ఒక్క వస్తువు కూడా పోకుండా ఉపయోగించు కునేందుకు నెలకొల్పాసిన పరిశ్రమలపై సైతం అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను అభివృద్ది చేయడమే లక్ష్యం

హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చి దిద్దుతామని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఏడాదిలో హైదరాబాద్‌ను పరిశుభ్రంగా చేసేందుకు కృషి చేస్తామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కమిటీ అధ్యక్షుడిగా ఆయన కమిటీ సభ్యులతో కలిసి నాగ్‌పూర్‌లో పర్యటించారు. నాగ్‌పూర్‌లో చెత్తనుంచి విద్యుత్‌ ఉత్పత్తి, కార్పొరేషన్‌ విధానాన్ని పరిశీలించామని తెలిపారు. చెత్త సేకరణ, డంపింగ్‌ యార్డు నుంచి తరలింపు వంటి అంశాలను పరిశీలించామన్నారు. బీబీనగర్‌లో రూ.20 కోట్ల వ్యయంతో చెత్త నుంచి విద్దుదుత్పతి చేసే పరిశ్రమను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. వెయ్యి టన్నుల చెత్తతో 11 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కమిటీలో డిప్యూటీ సీఎం మహమూద్‌ ఆలీ, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, ఎన్వీస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు సభ్యులుగా ఉన్నారు.

చెత్త నిర్వహణపై దృష్టిహైదరాబాద్‌ నగరంలో 5 వేల మెగా టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ అన్నారు. నాగ్‌పూర్‌లో పీపీపీ పద్ధతిలో చెత్త నిర్వహణ జరుగుతోందని తెలిపారు. శిథిలాల నుంచి సేకరించిన చెత్తతో వస్తువులు తయారు చేస్తున్నారని వివరించారు. ఇదే పద్ధతిలో హైదరాబాద్‌లో చెత్త నిర్వహణపై దృష్టి పెడతామన్నారు. తొలుత 1100 మెగా టన్నుల చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పతిని చేసే యోచన ప్రభుత్వానికి ఉన్నట్టు వెల్లడించారు. ఆగస్టులో చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని చేసే ప్లాంట్‌ను ప్రారంభిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ చేతుల విూదుగా విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తే హైదరాబాద్‌ పరిశుభ్రంగా మారుతుందని తెలిపారు. చెత్త నిర్వహణపై అధ్యయనం చేసి సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. చెత్త నిర్వహణ అనేది నిరంతర పక్రియ అని, దీర్ఘకాలంగా ఈ పక్రియను చేపట్టాల్సి ఉంటుందని వెల్లడించారు.