ప్రభుత్వం ఏర్పాటుకు మేం సిధ్ధం

– గవర్నర్‌ను కలిసి విన్నవించిన శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీ
– ఎమ్మెల్యేల మద్దతు లేఖలను అందజేత
ముంబయి,నవంబర్‌25( జనంసాక్షి): మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రకటించాయి. ఈ మేరకు తమ పార్టీల ఎమ్మెల్యేల మద్దతు లేఖలను ఈ పార్టీలు గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీకి సమర్పించాయి. తమ 54 మంది ఎమ్మెల్యేలలో 51 మంది సంతకాలను ఎన్సీపీ అందజేయగా.. శివసేన తమ 63 మంది, కాంగ్రెస్‌ 44 మంది సభ్యుల మద్దతు లేఖలను సమర్పించాయి. సమాజ్‌ వాదీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు లేఖలు కూడా గవర్నర్‌ కు అందాయి. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో తమకే మెజారిటీ ఉందని ఈ మూడు ప్రధాన పార్టీలు చెప్పుకున్నాయి. కాగా-ఎన్సీపీకి చెందిన 54 మందితో బాటు 170 మంది ఎమ్మెల్యేల సపోర్ట్‌ తమకు ఉందని బీజేపీ సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ శరద్‌ పవార్‌ మాత్రం 51 మంది తమవైపే ఉన్నారని స్పష్టం చేస్తున్నారు. 24 గంటల్లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు బీజేపీని ఆదేశించిన నేపథ్యంలో.. సేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ ఎందుకైనా మంచిదని, తమకే మెజారిటీ ఉందంటూ తమ పార్టీల ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్‌ కు సమర్పించడం విశేషం.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా తమకే ఉందని ఈ పార్టీలు పేర్కొంటున్నాయి.