ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో రెండు నెలల జీతాలు

పొరపాటున వేశామని ప్రకటించిన పంజాబ్‌ ప్రభుత్వం

అమృత్‌సర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబరు నెల జీతంగా రెట్టింపు డబ్బు ఉద్యోగుల ఖాతాల్లో జమచేసి నాలుక కరుచుకున్నారు. రాష్ట్రప్రభుత్వం తమకు దీపావళి బహుమతిగా డబుల్‌ జీతం తమ ఖాతాల్లో వేసిందని ఉద్యోగులు సంబరపడ్డారు. అయితే ఇది ఎంతోసేపు నిలవలేదు. ఇదంతా పొరపాటుగా జరిగిన నిర్వాకమని ప్రభుత్వం /-రకటించి డబ్బులను వెనక్కి తీసుకుంది. తాము పొరపాటున డబుల్‌ జీతం ఖాతాల్లో వేశామని, అదనపు డబ్బును ఖాతాల్లోనుంచి డ్రా చేయవద్దని ప్రభుత్వ ట్రెజరీ ఉన్నతాధికారుల ప్రకటనతో ఉద్యోగుల సంతోషం ఆవిరైంది. తాను పొరపాటున అక్టోబరు నెల జీతం రెట్టింపు వేశామని, దీన్ని తిరిగి వెనక్కి తీసుకుంటామని జిల్లా ట్రెజరీ అధికారి ఏకే మైనీ అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులకు నోటీసు జారీ చేశారు. సాంకేతిక లోపం వల్లనే ఈ పొరపాటు జరిగిందని ట్రెజరీ అధికారి వివరణ ఇచ్చారు. ఒక్క అమృత్‌ సర్‌ జిల్లాలోనే 50 కోట్ల రూపాయలు అదనంగా ఉద్యోగులకు చెల్లించారని తేలింది. దీంతో అధికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి తీసుకునే పనిలో ట్రెజరీ అధికారులు మునిగారు.