ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్‌ ఉపయోగించుకునేనా?

ప్రజా గాయకుడు గద్దర్‌ రాకతో కాంగ్రెస్‌కు ప్రచార బలం పెరిగినట్లే.. అయితే అధికార టిఆర్‌ఎస్‌ను ఢీకొనే క్రమంలో కాంగ్రెస్‌ ఎంత ఐక్యంగా ఉంటుందన్నది అనుమానంగానే ఉంది. వారికి టిక్కెట్ల విూద ఉన్న యావ, ఉమ్మడి పోరాటంపైన తక్కువే. వివిధ జిల్లాల్లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే గద్దర్‌, విమలక్క లాంటి వాళ్లు అధికార టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్దంగా ఉన్నారు. అలాగే మేధావులు, ప్రొఫెసర్లు ,యూత్‌ కూడా సిద్దంగా ఉంది. కానీ కాంగ్రెస్‌ ఈ వర్గాలకు నమ్మకం కలిగించలేలా చేయగలగాలి. ఈ దశలో ప్రభుత్వపైనా తీవ్ర వ్యతిరేక ఉంది. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడంలో ఉద్యమనేత పక్కకు తొలిగారన్న భావన విస్తృతంగా ఉంది. మళ్లీ నిజాంల పాలన సాగుతోందన్న భావన ఉంది. నిజం ఎన్ని మంచి పనులు చేసినా అతడిని ప్రజలు తరిమి కొట్టారు. అయితే టిఆర్‌ఎస్‌ విూద ఉన్న వ్యతిరేకతను ప్రజాస్వామ్యయుతంగా ఏ మేరకు కాంగ్రెస్‌ ఉపయోగించుకుంటుందన్నది ముఖ్యం.  మహాకూటమి పొత్తులే ఇంకా కొలిక్కి రాలేదు. సీట్ల సర్దుబాటు ఇంకా ముగించ లేదు. పార్టీలో నేతలు తలా ఓ రకంగా మాట్లాడుతు న్నారు. దీంతో గద్దర్‌ వచ్చినా ఉమ్మడిగా ముందుకు వెళ్లేందుకు కాంగ్రెస్‌ కొన్ని త్యాగాలుకు సిద్దపడాలి. అందుకు అది సిద్దంగా ఉన్న సంకేతాలు రావాలి. గద్దర్‌ ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ను  కలసి రావడంతో అసెంబ్లీ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమ లక్ష్యాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిశామని గద్దర్‌ చెప్పినట్లు వెల్లడించారు. అంటే గద్దరు చాలా ధృడచిత్తంతో ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికలకు ఇంతకాలం దూరంగా ఉంటూ వచ్చిన ఈ నేత ఇప్పుడు తన ఆటాపాటతో ప్రత్‌క్ష ఎన్నికల్లో ఊరావాడా ఉర్రూతలూగించనున్నారు. అందుకే రాహుల్‌తో భేటీలో  రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కొనేందుకు శక్తులను కూడగట్టే దిశగా సహకారం కోరేందుకు గద్దర్‌ను రాహుల్‌ స్వయంగా ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం. భావసారూప్యత దృష్ట్యా లౌకిక శక్తులకు సానుకూలంగా పనిచేయడం ద్వారా ఇరువురి లక్ష్యాలు అందు కోవచ్చని రాహుల్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని రాహుల్‌ కోరినా గద్దర్‌ సున్నితంగా తిరస్కరించారు. ఎందుకంటే తనవిూద ఓ పార్టీ ముద్ర ఉండకూడదన్న భావనతో గద్దర్‌ ఉన్నారు. కేసీఆర్‌కు, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి గద్దర్‌ దిగితే కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని, అందువల్ల కనీసం స్వతంత్రంగానైనా పోటీ చేయాలని రాహుల్‌ కోరినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు గద్దర్‌ కొన్ని షరతులతో సమ్మతించినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌పై గానీ, మరేదైనా కీలక స్థానంలో గానీ స్వతంత్రంగా పోటీ చేస్తానని, మహా కూటమి నుంచి అభ్యర్థులను ఎవరినీ నిలపొద్దని గద్దర్‌ కోరినట్లు సమాచారం. దీనిపై రాహుల్‌ కూడా భరోసా ఇచ్చారని తెలుస్తోంది.ఈ మేరకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ రాష్ట్ర కాంగ్రెస్‌కు గట్టి సంకేతం ఇవ్వాలి. ఇక్కడ పొత్తులన్నవి కూడా కేవలం కాంగ్రెస్‌ గెలవడానికే తప్ప మరోటి కాదని నేతలు గుర్తించాలి. ఓడిపోయే నేతలు కూడా తమకు తమకుటుంబాలకు టిక్కెట్లు కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సందర్భాలను పక్కన పెట్టి కుటుంబానికి ఒక్క టిక్కెట్‌ అన్న రూల్‌ పాటించాలి. గజ్వేల్‌ నియోజకవర్గంలో కేసీఆర్‌పై బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ తరఫున గద్దర్‌ పోటీ చేస్తారని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆయన మహాకూటమికి మద్దతు తెలపడంతో బీఎల్‌ఎఫ్‌ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ కేసీఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఒంటేరు ప్రతాపరెడ్డిని బరిలోకి దింపితే గద్దర్‌ వేరే నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదు కాబట్టి ఒకవేళ పోటీ చేసే
పరిస్థితి వస్తే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి మహాకూటమి మద్దతు కూడగట్టుకుంటారు.
ఇకపోతే  తెలంగాణ వస్తే ఆదర్శవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని భావించామని.. కానీ ఆశలు అడియాసలు అయ్యాయని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   నీటిపారుదల రంగంలో కాంట్రాక్టర్ల ఆధిపత్యం కొనసాగుతోందన్నాందోళన వ్యక్తం అవుతోంది. తెలంగాణకు హైదరాబాద్‌ నుంచి  ఆదాయం వస్తున్నా ఆకాంక్షలు నేరవేరకుండా అప్పుల కుప్పను చేశారన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షా 70 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రజారంజకమైన పథకాలకు ఖర్చు పెడితే కొంత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. భూపంపిణీ చేయనిదే అట్టడుగువర్గాల జీవితాల్లో మార్పు రాదన్నారు. కేరళ మాదిరిగా బడ్జెట్‌లో 37 శాతాన్ని విద్యారంగానికి కేటాయిస్తే మానవ వనరులు సృష్టించబడతాయని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామిక విలువలు నిర్దాక్షిణ్యంగా అణచివేయబడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో నిధులతోపాటు చైతన్యవంతమైన ప్రజలు అందుబాటులో ఉన్నారని, కానీ ఈ రెండింటినీ ఉపయోగించి అభివృద్ధి చేయకపోగా ప్రజల పాత్రను నిరాకరిస్తున్నారని విమర్శించారు.  రాజకీయ పడగ నీడలో న్యాయ వ్యవస్థ ఉందని, అందుకే నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు విూడియా సాక్షిగా బహిరంగంగా ప్రజల ముందుకు రావడం దేశంలో మొదటిసారిగా జరిగిందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. చరిత్ర చివరి దశలో ప్రజాస్వామ్యం నడుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఉన్నత న్యాయస్థానంపై విశ్వాసం కోల్పోకూడదని న్యాయవాదులు విూడియా ముందుకు వచ్చారని.. ఈ చర్యను పౌరహక్కుల సంఘం స్వాగతిస్తోందన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశాధ్యక్షుడు కోర్టు ప్రధాన న్యాయముర్తిగా సీనియర్‌ను నియమిస్తారన్నారు. ప్రభుత్వానికి అనుకూలమైన జడ్జీలను నియమించడం ద్వారా సీనియర్‌ జడ్జీలను పక్కన పెడుతూ కోర్టు సంప్రదాయాలను పాటించడం లేదన్నారు. సొహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు ముంబై హైకోర్టులో విచారణ జరుగుతుండగా దాన్ని సుప్రీంకోర్టుకు బదిలీ చేసి తనకు
అనుకూలమైన జడ్జీలతో బెంచ్‌ను ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. ఇలా ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన ఉంది. ఈ దశలో మహాకూటమి ఎలా ముందుకు వెళుతుందన్నది ప్రకటితం కావాలి.