ప్రమాదంలో జర్నలిస్టుకు తీవ్ర గాయాలు

కాకినాడకు తరలించిన చికిత్స

అమలాపురం,జూలై22(జనంసాక్షి): కోనసీమ జిల్లా ఆలమూరు మండలానికి చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ కోలాటి భైరవస్వామి (స్వామి) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడ్డాడు. తలకు బలమైన గాయాలు కాగా, సేవలందిస్తున్న వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు శుక్రవారం ధ్రువీకరించారు. వివరాలు లోనికి వెళితే విలేకరి స్వామి నర్సిపూడిలో వార్త కవరేజ్‌ కు వెళ్లి తిరిగి తన ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో మోదుకూరు ` గుమ్మలేరు మార్గంలో స్వామి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురయింది. దీంతో స్వామి క్రింద పడటంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆయన వెంట ఉన్న స్థానిక విలేకరులు స్పందించి మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం పరిస్థితిపై మెరుగైన వైద్యం కొరకు రాజమహేంద్రవరం తరలించారు. అక్కడ వైద్యులు సూచన మేరకు కాకినాడ ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఆలమూరు మండల ప్రెస్‌ క్లబ్‌ సభ్యులు హుటాహుటిన కాకినాడ చేరుకుని స్వామి ఆరోగ్య పరిస్థితులపై వైద్యుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా స్వామికి జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలు
కావడంతో ఖరీదైన వైద్యం జరగాలని వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం స్వామి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.