ప్రమాద బాధితులకు అంబేద్కర్ సేవా సమితి ఆర్థిక సహాయం

గత వారంలో శనివారం రాత్రి మునగాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి హాజరై రాత్రివేళలో తిరుగు ప్రయాణంలో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారనే సంగతి విధితమే. అయితే మంగళవారం మునగాల మండల కేంద్రంలోని మునగాల అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో చనిపోయిన కుటుంబాలకు, గాయపడిన కుటుంబాలకు 61 వేల 500 రూపాయల ఆర్థిక సహాయాన్ని చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుచున్న పడిపూజ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న భక్తులు ఈ విధంగా దుర్మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వారు తెలిపారు. అయితే మృతి చెందిన కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేస్తున్నట్లు వారు ప్రకటించారు. వారు తీసుకున్న మంచి నిర్ణయానికి మండల ప్రజలు, పలువురు నాయకులు ఘనంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎల్ నాగబాబు, ఎల్ రామయ్య, లంజపల్లి శ్రీను, గట్టు వెంకన్న, రాజేష్, ఎల్  శ్రీను, గురుమూర్తి, కెవిఆర్, చేకూరి ముత్తయ్య, రవి, నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు.