ప్రశాంతగా ఎమ్మెల్సీ పోలింగ్
హైదరాబాద్ మార్చి 22 (జనంసాక్షి):
తెలంగాణలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్.రాంచందర్రావు హైదరాబాద్ తార్నాకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎర్రబెల్లి రామ్మోహనరావు వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాసనమండలి ా’య్రర్మన్ స్వామ్ణిొడ్ రాజేంద్రనగర్లో, రంగారెడ్డి జిల్లా తాండూరులో మంత్రి మహేందర్రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు జరగనుంది.
జిల్లాల్లో నమోదైన పోలింగ్ శాతాలు..
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 53 శాతం, మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి 38 శాతం పోలింగ్ నమోదైంది. వరంగల్ జిల్లాలో 51.36 శాతం, ఖమ్మం జిల్లాలో 49.61 శాతం, నల్గొండ జిల్లాలో 58.35 శాతం, హైదరాబాద్ జిల్లాలో 29 శాతం, రంగారెడ్డి జిల్లాలో 37 శాతం, మహబూబ్నగర్ జిల్లాలో 55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గతంతో పోలిస్తే 14 శాతం పోలింగ్ పెరిగినట్లు అధికారులు చెప్పారు.
25న ఓట్ల లెక్కింపు
ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 25వ తేదీన జరుగనుంది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు హైదరాబాద్ ఇస్సామియా బజార్లోని విక్టరీ ఇండోర్ స్టేడియంలో జరుగనుంది. లెక్కింపునకు 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కాలేజిలో జరుగుతుంది. ఓట్ల లెక్కింపునకు ఇక్కడ 20 టేబుళ్ళు ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.