ప్రేమించుకున్నారని.. బాలికపై పెద్దమనుషుల రాక్షసత్వం

రాయదుర్గం, ఆగస్టు 16: అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం కేపీ దొడ్డి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన దళిత యువతీయువకులు వన్నూరమ్మ, బాబు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వన్నూరమ్మ మైనర్‌. అయినా.. పెళ్లి చేసుకోవాలని భావించి మూడు రోజుల క్రితం గ్రామం నుంచి పరారయ్యారు. కుటుంబ సభ్యులు వారిని గాలించి తిరిగి గ్రామానికి తీసుకొచ్చారు. శుక్రవారం ఎస్సీ కాలనీ వద్ద ఉన్న రచ్చబండ వేదికగా గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు. ప్రేమించుకున్న వీళ్లిద్దరూ.. వరసకు అన్నాచెల్లెళ్లవుతారని తేల్చారు. దీంతో ఇరువురి తల్లిదండ్రులు వివాహానికి నిరాకరించారు.
గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు లింగప్ప, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బ్రహ్మానందరెడ్డిని కూడా ఈ పంచాయితీకి పిలిచారు. మైనర్‌ అయిన వన్నూరమ్మ మాత్రం బాబునే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పింది. దీంతో ఆగ్రహించిన లింగప్ప తొలుత వన్నూరమ్మ చెంపలపై చేతితో తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా.. విచక్షణారహితంగా కర్రతో బాదాడు. కాలితో గుండెలపై తన్నాడు. చివరికి పంచాయతీ పెద్దల మాట విననందున పోలీస్‌ స్టేషన్‌కు అప్పగిస్తామని నిర్ణయించారు. కాగా, యువతిని చితకబాదుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో సీఐ రాజా, ఎస్‌ఐ నాగన్న గ్రామానికి వెళ్లి సంఘటనపై విచారణ చేస్తున్నారు.