ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించండి
` లేదంటే సమ్మె బాట పడతాం
` మరోసారి ప్రైవేటు కళాశాలలు హెచ్చరిక
హైదరాబాద్(జనంసాక్షి):ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించక పోవడంతో ప్రైవేటు కళాశాలలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించిన కళాశాలల యాజమాన్యాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించాయి. సమావేశం అనంతరం ఎఫ్ఏటీహెచ్ఐ ఛైర్మన్ రమేశ్ మీడియాతో మాట్లాడారు.‘‘ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయలేదు. ప్రభుత్వానికి విద్యారంగం ఆఖరి ప్రాధాన్యతగా ఉంది. గత నెల 21, 22 తేదీల్లో రూ.600 కోట్లు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చినా బకాయిలు చెల్లించలేదు. కేవలం రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేశారు. దీపావళిలోపు రూ.1200 కోట్లు ఇస్తామన్నారు..ఎలా ఇస్తారో చెప్పాలి. ఈనెల 12లోపు బకాయిలు చెల్లించకుంటే.. 13 నుంచి సమ్మెకు వెళ్తాం. ఇవాళ్టి నుంచి సీఎంవో కార్యాలయంతో తప్ప మరెవరితో చర్చించం. అవసరమైతే విద్యార్థులతో కలిసి ఛలో హైదరాబాద్ చేపడతాం’’ అని వివరించారు.