బతికుండగానే పాతిపెట్టేశారు…
మధ్యప్రదేశ్, సెప్టెంబర్ 21 : మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఓ వ్యక్తిని బతికుండగానే గోతిలో పూడ్చిపెట్టారు. ఆపైన రోడ్డు వేశారు. పూడ్చిన గోతిలోనుంచి సగం బయటపడిన మానవ శరీర భాగాలు స్థానికులను కలవరపాటుకు గురిచేశాయి. కాట్నీ జిల్లాలోని ఉడ్లోనాహతా మార్గంలో ఒక రోడ్డు వేస్తున్నారు. అక్కడ గోతిలో పొరపాటున పడిపోయిన వ్యక్తిపై కంకర వేసి పాతిపెట్టారు. మృతుడు కాద్రా గ్రామానికి చెందిన లటోరీబర్మా (45)గా గుర్తించారు. వివరాల్లోకి వెలితే…
బర్మా తన భార్యతో కలిసి (ఈనెల 18న) రుషి పంచమీ వేడుకలకు అత్తవారింటికి వెళ్లారు. భార్య పుట్టింట్లో ఉండిపోవడంతో స్వగ్రామానికి ఒంటరిగా ప్రయాణం అయ్యాడు. దారిలో మద్యం సేవించాడు. రాత్రివేల నడుచుకుంటూ వెళుతూ గోతిలోపడిపోయాడు. తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తెల్లవారి ఉదయం రోడ్డు పనులు చేస్తున్న కార్మికులు అతన్ని చూడకుండానే గోతిని పూచ్చిపెట్టేశారు. గుంట నుంచి బర్మాన్ చేయి బయటపడడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మృతిని బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృత దేహాన్ని వెలికితీశారు. మృతుని కుటుంబానికి జిల్లా కలెక్టర్ రూ. 50వేల పరిహారాన్ని ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, కార్మికులపై చర్యలకు ఆయన ఆదేశించారు.