బలహీనవర్గాలకు ఈ ఏడాది పదిలక్షల ఇళ్లు

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భువనగిరి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ , బలహీనవర్గాల కోసం ఈ ఏడాది పది లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈరోజు నల్గొండ జిల్లా భువనగిరి బైపాస్‌రోడ్డులో సంకల్ప్‌ హోటల్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా గృహనిర్మాణాన్ని ఇంత విస్తృతంగా చేపట్టడం లేదని ఆయన అన్నారు. ఎస్పీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. వెయ్యికోట్లు కేటాయించామన్నారు. ఉప ప్రణాళిక అమలుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికొత్త పార్టీలొచ్చినా ఎలాంటి సంక్షిష్ట పరిస్థితి ఎదురైనా కాంగ్రెస్‌ వాటిన్నింటిని ఎదుర్కొంటుందన్నారు. పార్టీ అండగా ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలకు ఉద్భోదించారు. ఆయనతోపాటు ఆలేరు ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్‌, భువనగిరి కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి చింతల వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్‌చైర్మన్‌ ప్రమోద్‌కుమార్‌ పాల్గొన్నారు.