బాబుకు హైఓల్టేజ్‌ షాక్‌

5

– టీడీపీఎల్పీ లీడర్‌ ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరిక

– మరోఇద్దరొస్తారు

– దయాకర్‌ రావు

హైదరాబాద్‌,ఫిబ్రవరి 10(జనంసాక్షి): తెలంగాణలో టీడీపీకి మరోసారి భారీ షాక్‌ తగిలింది. తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు సైకిల్‌ దిగి కారెక్కారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఎర్రబెల్లి దయాకర్‌ రావు టీఆర్‌ఎస్‌ లో చేరిపోయారు. ఎర్రబెల్లితో పాటు రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ (టీడీపీ) కూడా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ తో భేటీ అయ్యారు.  త్వరలోనే వరంగల్‌ లేదా నిజాం కాలేజ్‌ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్‌ సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరుతున్నట్టు ఎర్రబెల్లి దయాకర్‌రావు విూడియాకు వెల్లడించారు. ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్‌ రాజీనామా లేఖలను ష్యాక్స్‌ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపిన విషయం తెలిసిందే. అంతకు ముందు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ లో నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌ రావుతో భేటీలో టీఆర్‌ఎస్‌ లో చేరాలని ఎర్రబెల్లి నిర్ణయించుకున్నారు. మరోవైపు ఎర్రబెల్లి దయాకరరావు, ప్రకాష్‌ గౌడ్‌… టీడీపీకి రాజీనామా చేశారు. వారు తమ రాజీనామా లేఖలను పార్టీ కార్యాలయానికి ఫ్యాక్స్‌ ద్వారా పంపారు. మెదక్‌ జిల్లా నారాయణ ఖేడ్‌ సభ ముగిసిన తర్వాత హరీష్‌ రావు నేరుగా హైదరాబాద్‌ వచ్చారు. అనంతరం ఎర్రబెల్లి, హరీష్‌ భేటీ అయ్యారు. ఎర్రబెల్లిని టీఆర్‌ఎస్‌ లో చేర్చే బాధ్యతను సీఎం కేసీఆర్‌, హరీష్‌ రావుకు అప్పగించడంతో ఈ భేటీ జరిగింది. ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌ లో చేరినట్లు ఈ భేటీ ద్వారా ఖాయం అయింది. హరీష్‌ తో భేటీకి ముందు టీడీపీకి దయాకర్‌ రావు రాజీనామా చేశారు. ఎర్రబెల్లితో పాటు అయితే, ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇటీవల జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లోనూ ఆయన తగిన ప్రాధాన్యం కల్పించకపోవడం సహా ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలవ్వడం ఆయనకు ప్రతికూలంగా మారాయి. బీజేపీతో పొత్తులు, అభ్యర్థుల ఖరారు చేయడం అన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు లోకేష్‌ కనుసన్నల్లోనే జరగడం కూడా ఎర్రబెల్లికి ఏమాత్రం రుచించలేదు. గ్రేటర్‌ లో పార్టీ పట్టుకోల్పోవడం, తాజాగా గ్రేటర్‌ లో కేవలం ఒక్క సీటుకే పరిమితమై పార్టీ కార్యకర్తలకే కాదు పార్టీ నేతలకూ భారీ షాక్‌ కు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. గ్రేటర్‌ ఫలితాల అనంతరం కుత్బుల్లాపూర్‌ టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద టీఆర్‌ఎస్‌ లో చేరిన విషయం తెలిసిందే.

చంద్రబాబు అంటే ఇష్టమే కానీ టీడీపీ బతకదు:ఎర్రబెల్లి

తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ గా వ్యవహరిస్తోన్న సీనియర్‌ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ కూడా ఆయన వెంట గులాబీ గూటికి చేరుకున్నారు. బుధవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌.. ఎర్రబెల్లి, ప్రకాశ్‌ గౌడ్‌ లకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక అనంతరం ఎర్రబెల్లి విూడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పటికీ తనకు ప్రేమ ఉందని, అయితే టీఆర్‌ఎస్‌ తోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. టీడీపీ ఇక్కడ బతకలేని పరిస్థితి అర్థమయినందునే తాను, ప్రకాశ్‌ గౌడ్‌ తో కలిసి పార్టీ మారినట్లు వివరించారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలను కూడా టీఆర్‌ఎస్‌ లో చేరాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ‘టీడీపీని వీడటం బాధగా ఉంది. చంద్రబాబంటే ఇప్పటికీ ఇష్టమే. కానీ ఇక్కడ పార్టీ బతకదు. ప్రజలు టీఆర్‌ఎస్‌ వెంట ఉన్నారు. మెన్నటి గ్రేటర్‌ ఎన్నికల్లోనూ ఇది స్పష్టంగా వెల్లడైంది. అందుకే ఈ పార్టీలో చేరా. కార్యకర్తలు, నాయకులు క్షమించి, సహకరించాలని కోరుతున్నా’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు ఎర్రబెల్లి. పార్టీ లేదా ప్రభుత్వంలో విూరు కీలకపాత్ర పోషించనున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు బదిలిస్తూ.. అలాంటి హావిూలేవీ పొందలేదని స్పష్టం చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా తాను అనేక పదవులు చేపట్టానని గుర్తు చేశారు. ఇప్పటికి క్యాంప్‌ ఆఫీస్‌ లో కండువా కప్పుకున్నప్పటికీ త్వరలోనే వరంగల్‌ లోగానీ, హైదరాబాద్‌ లో గానీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఎర్రబెల్లి చెప్పారు.