బాబుతో జతకట్టిన కూటమిని ఓడించాలి

గండ్ర సుజాతది ఈ ప్రాంతమే కాదు
పాయల శంకర్‌ నడిబజారులో అమ్మేస్తాడు
ఎన్నికల ప్రచారంలో మంత్రి జోగురామన్న విమర్శలు
ఆదిలాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడి.. వందలాది మంది యువకుల బలిదానాలకు కారణమైన చంద్రబాబునాయుడితో జతకట్టిన కాంగ్రెస్‌ కు తగిన బుద్ధి చెప్పాలి రాష్ట్ర మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌ నియోజవర్గంలోని బట్టిసవర్గాం గ్రామ పంచాయతీలో మంత్రి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర సుజాత ది ఆదిలాబాద్‌ ఊరు కాని ఆదిలాబాద్‌ తాలుకా గాని ఆదిలాబాద్‌ నియోజకవర్గం కానీ కాదు అలాంటి ఆమెకు ఇక్కడి ఓటర్లు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఇక బీజేపీ అభ్యర్థి పాయల్‌ శంకర్‌ అయితే అరచేతిలో వైకుంఠాన్ని చూపడంతో పాటు ఎమ్మెల్యేగా గెలిస్తే పట్టపగలే ఆదిలాబాద్‌ ని అంబేద్కర్‌ చౌక్‌ లో అమ్మకానికి పెడతాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో 50 మంది యువత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక సైతం ప్రాజెక్టులకు, కరెంటుకు అనేక అభివృద్ధి పనులకు చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడన్నారు. మరోసారి ఆశీర్వదించండి.. అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తానని రాష్ట్ర మంత్రి జోగు రామన్న అన్నారు.  ఆదుకుంటున్న సంక్షేమ పథకాలను చూసి కేసీఆర్‌నే మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామంటున్నారన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్లు, రాయితీ రుణాలు, ఆరు కిలోల బియ్యం, 24 గంటల కరెంటు,
ఇంటింటికీ నల్లా నీరందించే మిషన్‌ భగీరథ పథకాలను చూసి టీఆర్‌ఎస్‌ పార్టీపై విశ్వాసం పెరిగిందని తెలిపారు. ప్రతిపక్షాల నాయకులు ప్రచారానికి వచ్చి ఉచిత హావిూలు ఎన్ని ఇచ్చినా నమ్మబోమని చెబుతుంటే సంతోషంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను వివరించారు. ఇప్పుడు ఇస్తున్న ఆసరా పింఛన్లను రూ.2016కు పెంచుతామని, వికలాంగులకు రూ.3016 ఇస్తామని తెలిపారు. నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3016 నిరుద్యోగ భృతి అందజేస్తామన్నారు. ఆర్యవైశ్యులకు, రెడ్డి కులస్థులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి అండగా ఉంటామన్నారు. పేదలకు స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని స్తోమత లేని వారికి వారి సొంత స్థలంలోనే డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లును కట్టించి ఇస్తామన్నారు. రైతులకు మరోసారి రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్నారు. రైతు బంధు కింద ప్రస్తుతం ఇస్తున్న ఎకరాకు రూ.8వేలను రూ.10వేలకు పెంచుతామని చెప్పారు. తమది చేతల ప్రభుత్వమని.. కేసీఆర్‌ మాట ఇచ్చాక తప్పకుండా అమలు చేసి తీరుతారన్నారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో మహాకూటమిలోని పార్టీలకు నాయకులు, కార్యకర్తలు కూడా లేరన్నారు. ఆ పార్టీలకు అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని.. మెజార్టీ మాత్రమే తేలాల్సి ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు కొత్తగా ఏర్పడిన తెలంగాణలో సిఎం కెసిఆర్‌ అమలు చేస్తున్నారన్నారు.