బాబు షూటింగ్‌వల్లే తొక్కిసలాట: బొత్స

3

హైదరాబాద్‌,జులై17(జనంసాక్షి):

రాజమండ్రి దుర్ఘటన సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్షం వైసీపీ విమర్శల దాడి కొనసాగిస్తోంది. పుష్కరాలపై బోయపాటి దర్శకత్వంలో చంద్రబాబుపై డ్యాకుమెంటరీ చిత్రీకరణ జరిపారని అందువల్లే పుష్కరాల్లో దుర్ఘటన జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా ఆ వాఖ్యలను సమర్థిస్తూ చంద్రబాబును వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యానారాయణ విమర్శించారు. దుర్ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం సరికాదు అని ఆయన అన్నారు. రాజమండ్రిలో జరిగిన పుష్కర తొక్కిసలాట ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని  విమర్శించారు. ముందుగా ఈ ఘటనకు బాద్యత వహించి ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పుష్కరాలపై సినీ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చంద్రబాబు డాక్యుమెంటరీ తీసే కార్యక్రమం చేపట్టడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన అన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్‌ చేస్తున్నామని బొత్స చెప్పారు. అధికారులంతా చంద్రబాబు సేవలో తరించే పనిలో ఉండడం వల్లనే ఇది జరిగిందని ఆయన అన్నారు. ఇంతటి ఘోరం జరిగినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందన్నారు.