బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లతో తెలంగాణకు నష్టం

` ఈ రెండు పార్టీలలో  ఏది గెలిచినా  ఉపఎన్నికలు గ్యారెంటీ
` సిరిసిల్ల ప్రచారంలో   బండి సంజయ్‌
రాజన్న సిరిసిల్ల బ్యూరో(జనంసాక్షి):బిఆర్‌ఎస్‌ గెలిచిన కాంగ్రెస్‌ గెలిచిన ఉప ఎన్నికలు గ్యారెంటీ అని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సిరిసిల్లలో బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. కలెక్టరేట్‌ చౌరస్తా నుండి సిరిసిల్ల నేతన్న విగ్రహం వరకు బైక్‌ ర్యాలీతో రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం నేతన్న విగ్రహం వద్ద ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్‌ మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీల తీరుపై మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ షాడో సీఎంలా వ్యవహరిస్తూ నియంతల వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.సిరిసిల్ల నియోజకవర్గానికి ఏం చేశారో శ్వేతా పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బిఆర్‌ఎస్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని రాష్ట్రంలో ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల జనాధరణ ఉందని అన్నారు. ఒకవేళ బిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలు అధికారంలోకి వస్తే ఉప ఎన్నికలు గ్యారెంటీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల ప్రజలు రాణి రుద్రమ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాణి రుద్రమ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్లలో కేటీఆర్‌ ను ఎదుర్కొనేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని కేటీఆర్‌ ను ఓడగొట్టేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు రెడ్డబోయిన గోపి, నాగుల శ్రీనివాస్‌, శీలం రాజు, ఆడపు రవీందర్‌, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.