బిజెపిలో ముదిరిన స్వామిభక్తి

మోదీ విష్ణువు 11వ అవతారమన్న పార్టీ అధికార ప్రతినిధి వాఘ్‌
ముంబై,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): బిజెపిలో స్వామిభక్తి పరాకాష్టకు చేరింది.  మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి అవధూత్‌ వాఘ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విష్ణుదేవుని 11వ అవతారమని అవధూత్‌ వ్యాఖ్యానించారు. దేవుడులాంటి నాయకుడు నరేంద్ర మోదీ మనకు దొరకడం దేశం చేసుకున్న అదృష్టమని వాఘ్‌ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రధాని నరేంద్రమోదీని ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారని కాని మోదీ విష్ణుభగవానుని 11వ అవతారమని అవధూత్‌ వాఘ్‌ ట్వీట్రు చేశారు. ఓ మరాఠీ న్యూస్‌ చానల్‌తో అవధూత్‌ మాట్లాడుతూ దేవుడు లాంటి మోదీ మనకు దొరకడం మన దేశం చేసుకున్న అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. వాఘ్‌ చేసిన వ్యాఖ్యలు హిందూ దేవుళ్లతో మోదీని పోల్చడం దేవుడిని అవమానపర్చడమేనని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అతుల్‌ లోందే విమర్శించారు. ఇంజినీరింగ్‌ చదివిన వాఘ్‌ మోదీని దేవుడితో పోల్చడం సరికాదన్నారు. వాఘ్‌ బీటెక్‌ డిగ్రీని సరైనదా కాదా అనేది ఒకసారి తనిఖీ చేయాలని ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అహ్వాద్‌ కోరారు.