బిజెపి అధికారంలోకి వస్తే మతమార్పిడిల బిల్లు

ఎపిలో ప్రజాస్వామ్యం మంట కలిసింది
ఎపి పునర్నిర్మాణానికి నిధులు ఇస్తున్న కేంద్రం
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సునీల్‌ దియోధర్‌
విజయవాడ,డిసెంబర్‌24(జనం సాక్షి): ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని
తీసుకొస్తామని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సునీల్‌ దియోధర్‌ అన్నారు. జగన్‌ సర్కార్‌ మత మార్పిడులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చర్చిల నిర్మాణాలకు ప్రభుత్వ నిధులను మంజూరు చేస్తున్నారు. పాస్టర్లకు జీతాలు చెల్లిస్తున్నారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమలు కావడం లేదని మండిపడ్డారు. ప్రధాని మోడీ ఎపి పునర్మిర్మాణాకి అవసరమైన సహకారం, నిధులు అందించేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరిశ్రమలకు, నిర్మాణ రంగాలకు భూములను కేటాయించడం లేదన్నారు. చందవరం లాంటి బౌధ్ద ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ది చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి గుర్తుకు రావడం లేదన్నారు.చందవరాన్ని బుద్ధుడు, ఆయన కుమార్తె సంగమిత్రలు సందర్శించారని గుర్తు చేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తే జపాన్‌, శ్రీలంక దేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారని.. వెనుకబడిన ప్రకాశంజిల్లాలో టూరిజం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయ పడ్డారు.చంద్రన్న, జగనన్న ఈ ఇద్దరు అన్నలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు తమ పేర్లు పెట్టుకుంటున్నారని విమర్శించారు. వైసీపీలో నేతలు బూతులు మాట్లడుతుంటే.. కిందిస్తాయిలో సుబ్బారావు గుప్తా లాంటి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని.. తమ బాధను భయటకు చెప్పినందుకు దాడులు చేయిస్తారా అంటూ ప్రశ్నించారు. గుప్తా చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉంది కాబట్టే సుభాని వంటి నేతలు దారుణంగా దాడి చేసి కొట్టారని అన్నారు. ఒక గుప్తాపై దాడి చేస్తాడా? గుప్తా ఇంటికి వెళ్ళి ఆయన్ను పరామర్శించేందుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తే ఆయన అక్కడ లేరట.. వైసీపీ నేతలు ఆయన కుటుంబాన్ని బలవంతంగా తిరుమల బాలాజీ దర్శనానికి పంపారట.. ఇది మరీ విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ సర్కార్‌ పూర్తి స్థాయిలో విఫలమైందని.. ఏపీలో వైసీపీ నేతలు రౌడీ రాజ్యం నడుస్తోందని అన్నారు. వైసిపి పాలనలో భూములు కబ్జాకు గురవుతున్నాయి. వైసీపీ నేతలు లిక్కర్‌, శాండ్‌, గంజాయి, డ్రగ్స్‌, లాండ్‌ మాఫియాలుగా మారిపోయిదోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి నుంచి నడికుడి రైల్వే లైన్‌ ఏర్పాటు చేసేందుకు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అన్నారు. గనులు ఉన్న ప్రాంతాల్లో నీటిని తాగి జనం వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.