బిజెపి పార్లమెంటరీ భేటీలో మంత్రికి అస్వస్థత
హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
న్యూఢిల్లీ,డిసెంబర్20(జనంసాక్షి): బుధవారం ఉదయం ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సమావేశంలో చిన్న అపశృతి చోటుచేఉకుంది. పార్లమెంట్లోని లైబ్రరీ భవనంలో ఈ సమావేశం జరిగింది. అయితే సమావేశం మొదలైన కొద్ది సేపటికే కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కృష్ణరాజ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాజ్నాథ్సింగ్, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ తదితర కేంద్రమంత్రులు, భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్షా తదితర పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ, జాతీయాధ్యక్షుడు అమిత్షాలను పార్టీ నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధానికి అమిత్షా స్వీటు తినిపించి నోరు తీపి చేశారు. ఈ సందర్భంలోనే కృష్ణరాజ్ అస్వస్థతకుగురికాగా హుటాహుటిన ఆస్పత్రికి
తరలించారు.