బిహార్‌లో మరో పరువు హత్య

కూతుర్ని, ఆమె ప్రియుడిని కొట్టి చంపిన తండ్రి

మోతిహరీ(బిహార్), నవంబరు 06: బిహార్‌లో మరో పరువు హత్య జరిగింది. ప్రియుడితో కలిసున్న కూతురిని చూసిన తండ్రి ఆగ్రహం పట్టలేక ఇద్దరినీ కడతేర్చాడు. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు. బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా బర్హర్వా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షాలు(18), శతృఘన్ రామ్(19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం రాత్రి వారిద్దరూ కలిసి ఇంట్లో ఉండడాన్ని గమనించిన యువతి తండ్రి రాజేంద్రప్రసాద్ కోపంతో రగిలిపోయాడు. ఆవేశం పట్టలేక వారిద్దరినీ కొట్టి చంపినట్టు డీఎస్పీ హక్ తెలిపారు. ఈ రోజు ఉదయం మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. నిందితుడు రాజేంద్రప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. తానే ఈ హత్యలు చేసినట్టు అతను అంగీకరించినట్టు డీఎస్పీ తెలిపారు.