బీజేపీకి షాకిచ్చిన జేడీయూ!

– వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటిరిగానే బరిలోకి
– వెల్లడించిన జేడీయూ వర్గాలు
పాట్నా, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ) : వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిహార్‌లో అధికార జేడీయూ-భాజపా మధ్య సయోధ్య కుదిరిన విషయం తెలిసిందే. అయితే సీట్ల పంపకం విషయంలో స్పష్టత వచ్చిందనుకున్న తరుణంలో భాజపాకు జేడీయూ పెద్ద షాక్‌ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు జేడీయూ వర్గాలు వెల్లడించాయి. బిహార్‌లో ఉన్న 40లోక్‌సభ స్థానాలకు గానూ 20 సీట్లు భాజపాకు ఇవ్వాలన్న డిమాండే దీనికి కారణమని తెలుస్తోంది. నితీశ్‌ కుమార్‌ పార్టీకి 12 సీట్లు, రామ్‌ విలాస్‌ పాసవాన్‌ పార్టీ అయిన లోక్‌ జనశక్తి పార్టీ(ఎస్‌జేపీ) ఆరు సీట్లు, ఉపేంద్ర కుశ్వాహా పార్టీ అయిన రాష్టీయ్ర లోక్‌ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ)కి రెండు సీట్లు ఇచ్చేలా భాజపా ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనను జీర్ణించుకోలేని జేడీయూ ఒంటరిగానే బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇవన్నీ పుకార్లే – జేడీయూ నేత కేసీ త్యాగి
జేడీయూ నేత కేసీ త్యాగి మాట్లాడుతూ..  సీట్ల పంపకం ఇంకా జరగలేదని ఇవి పుకార్లు మాత్రమే అని తేల్చారు. సీట్ల పంపకం విషయం ఇంకా చర్చల దశలోనే ఉందని, మరి ఇలాంటి వార్తలు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియడం లేదు. అయితే, ఈ లెక్కలు ఎంతమాత్రం మాకు ఆమోద్యయోగ్యమైనవి కావన్నారు. జేడీయూకి 25 సీట్లు, ఇతర పార్టీలకు 15 సీట్లు కేటాయించాలనేది మా డిమాండ్‌ అని, భాజపా ఇందుకు అంగీకరించకపోతే కచ్చితంగా ఒంటరిగానే పోటీ చేస్తామని  అన్నారు. అయితే, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ ఉప ఎన్నికల్లో భాజపా ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. కర్ణాటకలోనూ దాదాపు ఇదే ఘట్టం పునరావృతమైంది. 100కు పైగా సీట్లు సాధించినప్పటికీ మేజిక్‌ ఫిగర్‌ను చేరుకోకపోయే సరికి ప్రతిపక్షంగానే మిగలాల్సి వచ్చింది. ఈ అవకాశాలన్నింటినీ జేడీయూ తమకు అనుకూలంగా మార్చుకుని మరిన్ని సీట్లు రాబట్టకునేందుకు గట్టుగా పావులు కదుపుతోంది.