బీహర్‌లో మోగిన ఎన్నికల నగారా

3
ఐదు విడుతల్లో పోలింగ్‌ సీఈసీ

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న సిఇసి

అక్టోబర్‌ 12 నుంచి నవంబర్‌ 5 వరకు ఎన్నికలు

8న ఓట్ల లెక్కింపు..ఫలితాల ప్రకటన

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9 (జనంసాక్షి):

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం  ప్రకటించింది. 243 స్థానాలున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఐదు దశల్లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నసీమ్‌ జైదీ వెల్లడించారు. త్వరలో జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నసీమ్‌ జైదీ బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఐదు దశల్లో నిర్వహించనున్నట్లు నసీమ్‌ జైదీ ప్రకటించారు. బిహార్‌ ఎన్నికల్లో దాదాపు 6.68 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అక్టోబర్‌ 12 నుంచి నవంబర్‌ 5 వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పోలింగ్‌ అక్టోబర్‌ 12, రెండో విడత పోలింగ్‌ అక్టోబర్‌ 16, మూడో విడత పోలింగ్‌ అక్టోబర్‌ 28 నాలుగో విడత పోలింగ్‌ నవంబర్‌ 1,ఐదో విడత పోలింగ్‌ నవంబర్‌ 5న జరుగుతాయి. నవంబర్‌ 8న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. ఇక  నేతల పర్యటనలకు 36 గంటల ముందు అనుమతులు తీసుకోవాలి. 48 గంటల ముందు ఒపీనియన్స్‌ పోల్స్‌ నిషేధం విధించారు.  ప్రవర్తనా నియమావళి వెంటనే అమల్లోకి వస్తుంది.  పోలింగ్‌కు ఐదు రోజులు ముందు పోల్‌ స్లిప్‌లు పంపిణీ జరుగుతంది.  ప్రతి జిల్లాలో ఏకగవాక్ష పద్ధతిలో వ్యవ్థసీకృత యంత్రాంగం ఏర్పాటు చేస్తారు. సెప్టెంబర్‌ పదహారు నుంచి నామినేషన్లు పర్వం ఆరంభం అవుతుంది. బీహారులో 6.6కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.మొత్తం 243 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. వీటిలో నలభై ఏడునియోజకవర్గాలను సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించారు. ఎన్నికలలో డబ్బు, మద్యం తదితర అక్రమాలను నిరోదించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. నవంబర్‌ 29న ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగియనుండడంతో కొత్త అసెంబ్లీ ఎన్నిక కోసం ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు  సిఇసి ప్రకటించారు.  ఐదు దశల్లో కొనసాగే పోలింగ్‌లో అక్టోబర్‌ 12న తొలిదశ ప్రారంభంకానుంది. నవంబర్‌ 8న ఫలితాలు వెల్లడిస్తారు. పోలింగ్‌లో వాడే ఈవీఎంలు పోటీచేసే అభ్యర్థుల ఫోటోలను కలిగిఉంటాయన్నారు. వివరాలు వెల్లడిస్తూ 47 అసెంబ్లీ స్థానాల్లో నక్సల్స్‌ ప్రభావం ఉంది. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కేంద్ర పారామిలటరీ బలగాలు భద్రతను పర్యవేక్షిస్తాయి. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల డిమాండ్‌ మేరకు సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ బలగాల భద్రతను ఏర్పాటు చేస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ వెల్లడించారు. పెయిడ్‌ న్యూస్‌, ఓటర్లకు డబ్బు పంచడం, మద్యం సరఫరాపై కఠినంగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు 15 సంస్థలతో కలిసి నిఘాను పర్యవేక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.బిహార్‌తో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉప ఎన్నిక షెడ్యూల్‌ను సీఈసీ ప్రకటించింది. నితీష్‌కుమార్‌ తన పదేళ్ల పదవీకాలం తర్వాత మూడోసారి సీఎం అయ్యేందుకు ఈసారి రాష్టీయ్ర జనతాదళ్‌, కాంగ్రెస్‌తో జతకట్టి ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. నితీష్‌ 2013 జూన్‌లో ఎన్‌డీఏకు దూరం జరిగిని విషయం తెలిసిందే. రాంవిలాస్‌ పాశ్వాన్‌ ‘లోక్‌ జనశక్తి పార్టీ’తో అదేవిధంగా ఉపేంద్ర కుశ్వాష్‌ ‘రాష్టీయ్ర లోక్‌ సమతా పార్టీ’తో జతకట్టిన బీజేపీ లోక్‌సభ స్థానాలను దాదాపు కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే తీరును తిరగరాయలని ఆపార్టీ ఉవ్విళ్లూరుతుంది.