బీహార్ ముగిసిన తొలిదశ ప్రచారం
పట్నా,అక్టోబరు 26(జనంసాక్షి): బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత ప్రచారానికి తెరపడింది. ఈ నెల 28న (బుధవారం) 71 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత ఎన్నికలకు వాడీ వేడిగా ప్రచారం సాగింది. అధికార, విపక్ష పార్టీలు ప్రచారాన్ని ¬రెత్తించాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో బిహార్ రాజకీయాలను హీటెక్కించాయి. ప్రధాని నరేంద్ర మోదీ మూడు ప్రచార ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. ఓట్ల వర్షం కురిపించడమే లక్ష్యంగా తొలి విడత ప్రచారం సాగింది. ఎన్డీయే కూటమికి ఓటు వేసి నితీశ్ కుమార్కు మరోసారి అధికారం అప్పగించాలని ప్రధాని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తమ కూటమి (ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్) అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.భాజపా స్టార్ క్యాంపెయినర్లుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ముమ్మారు తలక్ సహా పలు అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలను ఓటర్లకు వివరించారు. తద్వారా ఓటర్లను ఎన్డీయే కూటమి వైపు ఆకర్షితుల్ని చేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు, తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని నితీశ్ కుమార్ కోరారు. వర్చువల్ ర్యాలీల్లోనే కాకుండా అనేక బహిరంగ సభల్లోనూ ఆయన పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి రెండు సభల్లో వేదికను పంచుకున్నారు.ఆర్జేడీ నేత, విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ కూడా ముమ్మర ప్రచారం సాగించారు. ర్యాలీలతో పాటు సామాజిక మాధ్యమాల్లో వీడియో సందేశాలు పంపడం, విూడియా సమావేశాలతో జనంలోకి దూసుకెళ్లారు. మరోవైపు, ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగి అందరినీ ఆశ్చర్యపరిచిన ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తనదైన శైలిలో ప్రచారం కొనసాగించారు. తన తండ్రి రాం విలాస్ పాశ్వాన్ను కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ పలు నియోజకవర్గాల్లో చురుగ్గానే తిరుగుతూ తమ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ పలు ర్యాలీల్లో పాల్గొనగా.. మరో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భాజపా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతలు రాజ్బబ్బర్, శత్రుఘ్నసిన్హా, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, సీపీఐ నేత కన్నయ్య కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కన్నయ్య కుమార్ ప్రధానంగా వామపక్ష పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.
తొలి విడతలో 71 స్థానాలకు బుధవారం ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తం 1066 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 114 మంది మహిళలే. నక్సల్ ప్రభావిత జిల్లాలైన గయా, రోహ్తాస్, ఔరంగాబాద్తో పాటు మొత్తం ఆరు జిల్లాల పరిధిలో తొలి దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలు నితీశ్ కుమార్ కేబినెట్లో ఆరుగురు మంత్రుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న 71 స్థానాల్లో ప్రధాన పార్టీలైన ఆర్జేడీ నుంచి 42 మందిని బరిలో నిలవగా.. జేడీయూ నుంచి 41, భాజపా 29, కాంగ్రెస్ 21, ఎల్జేపీ నుంచి 41మంది చొప్పున అభ్యర్థులను పోటీలో నిలిపాయి.