బెంగాల్లో కాంగ్రెస్తో సీపీఎం పొత్తు
దిల్లీ,అక్టోబరు 31(జనంసాక్షి):వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఎం కలిసి పనిచేయనుంది. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ లౌకిక శక్తులతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. శుక్ర, శనివారాల్లో వర్చువల్గా నిర్వహించిన సమావేశాల అనంతరం పార్టీ నిర్ణయాలను వెల్లడించారు.కేరళలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమిగానే బరిలోకి దిగనున్నట్లు సీపీఎం స్పష్టంచేసింది. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమితో కలిసి పనిచేయనుంది. అసోంలో కాంగ్రెస్ సహా ఇతర లౌకిక పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. అక్కడ అధికార భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా ఇతర పార్టీలతో కలిసి పనిచేయనున్నట్లు పేర్కొంది. ఒకప్పుడు పశ్చిమబెంగాల్ను మూడు దశాబ్దాల పాటు ఏలిన ఆ పార్టీ అధికార తృణమూల్ను, భాజపాను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సహా ఇతర లౌకిక పార్టీలతో ఎన్నికల అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఏచూరి తెలిపారు. 294 స్థానాలకు గాను ఆ పార్టీకి 2016లో కేవలం 26 స్థానాలు మాత్రమే వచ్చాయి.
కార్మికుల్ని బానిసలుగా మార్చే కుట్ర!
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఏచూరి దుమ్మెత్తిపోశారు. కరోనాను నియంత్రించడంలో తన బాధ్యతను మోదీ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. దేశంలో ప్రజలు నిరుద్యోగం, అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల ఖాతాల్లో నగదు జమ చేయాలన్న సీపీఎం డిమాండ్ను పట్టించుకోవడం లేదని విమర్శించారు. 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం కార్మిక హక్కులను హరించడమేనన్నారు. దీన్ని కార్మికులను బానిసలుగా మార్చే కుట్రగా అభివర్ణించారు. విదేశీ, దేశీయ కార్పొరేట్లకు దోచిపెట్టేవిగా వ్యవసాయ చట్టాలు ఉన్నాయన్నారు. వ్యవసాయ, కార్మిక చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి అంశాలపై దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని పార్టీ నిర్ణయించిందన్నారు. కార్మిక సంఘాలతో కలిసి నవంబర్ 26న జాతీయ స్థాయిలో సమ్మెకు పిలుపునిచ్చారు