బోఫోర్స్‌ కేసులో..  సీబీఐకి సుప్రీంలో షాక్‌!


– సీబీఐ విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయస్థానం
– సీబీఐ అపీల్‌ చేయడంలో ఆలస్యమైందని వెల్లడి
న్యూఢిల్లీ, నవంబర్‌2(జ‌నంసాక్షి) : బోఫోర్స్‌ కేసులో సీబీఐకి సుప్రింకోర్టు షాకిచ్చింది. హిందుజా సోదరులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే సీబీఐ చేసిన విఙ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. హిందూజా సోదరులతోపాటు మిగతా నిందితులను గతంలో ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. సీబీఐ చేసిన వినతిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. సీబీఐ అప్పీల్‌ చేయడంలో ఆలస్యమైందని, అందుకు చెప్పిన కారణాలు కూడా సహేతుకంగా లేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ న్యాయవాది అజయ్‌ అగర్వాల్‌ దాఖలుచేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని సీబీఐ గుర్తుచేసినా, ధర్మాసనం అంగీకరించలేదు. 1986 మార్చి 24న రూ.1432.72 కోట్లతో భారత ప్రభుత్వం 410 యూనిట్ల 155 ఎంఎం హవిట్జర్‌ శతఘ్నుల కొనుగోలుకు స్వీడన్‌కు చెందిన ఏబీ భోఫోర్స్‌తో ఒప్పందం చేసుకుంది. అయితే, ఈ ఒప్పందంలో భారీ మొత్తం చేతులు మారినట్టు 1987 ఏప్రిల్‌ 16న స్వీడిష్‌ రేడియో తొలిసారి ప్రకటించింది. భారత్‌లోని కొందరు రాజకీయ నాయకులకు లంచం ఇచ్చి బోఫోర్స్‌ సంస్థ ఈ ఒప్పందం చేసుకున్నారని తెలిపింది. కానీ, ఈ ఒప్పందంలో ఎవరు మధ్యవర్తిగా లేరు, ఎలాంటి ముడుపులు చెల్లించలేదని నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ 1987 ఏప్రిల్‌ 20 లోక్‌సభలో ప్రకటన. దీనిపై విచారణకు 1987 ఆగస్టు 6 న బీ శంకరానాంద్‌ నేతృత్వంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదై మూడు దశాబ్దాలు గడిచిపోయినా సీబీఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. రూ.64 కోట్లమేర అవినీతి జరిగితే, కేసు విచారణకు దాదాపు రూ.300 కోట్లు ఖర్చుచేయడం గమనార్హం.