బోరుబావిలో పడ్డ మరో చిన్నారి

లక్నో : బోరుబావులు… పిల్లల పాలిట మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మరో ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ పాడుపడిన బోరు బావిలో పడిన బాలుడు… శ్వాస అందక తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో సహాయక చర్యలు ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్ ఇమ్రోతా గ్రామానికి చెందిన ఐదేళ్ల నిఖిల్… సుమారు 50 అడుగుల లోతు బావిలో చిక్కుకుపోయాడు. సహాయక చర్యల్లో భాగంగా బాలుడికి ఆక్సిజన్ అందిస్తున్నట్లు ఝాన్సీ పోలీసులు చెబుతున్నారు. బాలుడ్ని సురక్షితంగా బయటకు తీసేందుకు బోరుబావి చుట్టూ 35 అడుగుల వరకూ భూమిని తవ్వుతున్నారు. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు సమీప పొలాల్లో పని చేస్తుండగా అక్కడే ఆడుకుంటున్న బాలుడు బోరు బావిలో పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. చిన్నారిని రక్షించడానికి సహాయక బృందం తీవ్రంగా కృషి చేస్తోందని, ఈ సాయంత్రానికి సురక్షితంగా బయటకు తీసే అవకాశం ఉందని జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ శుక్లా తెలిపారు.