బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ

జొహాన్నెస్‌బర్గ్‌(జనంసాక్షి): బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా బయల్దేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జొహాన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్‌ షిపోకోసా మషతిలే స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. బ్రిక్స్‌ సభ్య దేశాలు భవిష్యత్తులో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి, వ్యవస్థీకృత అభివృద్ధిని సవిూక్షించుకోవడానికి జొహాన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న సమావేశం కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే.ప్రధాని మోదీ ఆగస్టు 22` 24 వరకు 15వ బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం గ్రీస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. 2019 తర్వాత బ్రిక్స్‌ దేశాధినేతలు వ్యక్తిగతంగా హాజరవుతున్న తొలి సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యం పెరిగింది. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గైర్హాజరవుతున్నారు. పుతిన్‌ బదులు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ సదస్సులో పాల్గొంటారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మధ్య సమావేశం జరగనుందా.. లేదా..? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.