బ్లూవేల్స్‌ భూతం బారిన పడి మరో బాలుడు మృతి

బాలుడి ఆత్మహత్య

 లఖ్‌నవూ: గత కొన్ని రోజులుగా టీనేజర్ల పాలిట మృత్యు శాపంలా మారిన బ్లూవేల్స్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ బారిన పడి మరో బాలుడు మృతిచెందాడు. ఉత్తర ప్రదేశ్‌లోని హమీపూర్‌ జిల్లాలో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని మౌదహా గ్రామానికి చెందిన పార్థ్‌సింగ్‌(13) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.

ఆదివారం తన స్నేహితుని పుట్టిన రోజు వేడుకలకు వెళ్తానని చెప్పిన కుమారుడు గదిలో నుంచి బయటకు రాకపోవడం గుర్తించిన తండ్రి తలుపులు పగలగొట్టి చూడగా.. అప్పటికే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటాన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందకు దించగా.. అక్కడ తండ్రి సెల్‌ఫోన్‌ లభించింది. ఫోన్‌లో బ్లూవేల్‌ 50 ఛాలెంజ్‌ పూర్తిచేసినట్లు నమోదైంది. దీంతో బ్లూవేల్‌ బారిన పడే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. తమ కుమారుడు గత కొన్ని రోజులుగా మొబైల్‌లో ఆటలు ఆడుతున్నాడని తల్లిదండ్రులు తెలిపారు.