భాజపాతో ఎలాంటి ఒప్పందం లేదు
– అసద్
హైదరాబాద్ సెప్టంబర్ 20(జనంసాక్షి):
బిహార్ ఎన్నికల్లో తమ పార్టీ భారతీయ జనతా పార్టీతో ఎలాంటి రహస్య ఒప్పందం పెట్టుకోలేదని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎంఐఎం భాజపాతో రహస్యంగా పొత్తు కుదుర్చుకుందన్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిహార్లో జనతాపరివార్ కూటమిపై విమర్శల వర్షం కురిపించారు. జేడీయూ-ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి ద్వారా రాష్గానికి ఎలాంటి అభివృద్ధి జరగదని ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీల గత రికార్డులను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ సీమాంచల్ ప్రాంతానికే పరిమితమవుతుందని, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బిహార్ ప్రజలు మతపరమైన రాజకీయవిధానాలను కాకుండా లౌకిక నాయకత్వాన్ని గెలిపించాలని కోరారు.