భారత్‌పై ఉరుముతున్న చైనా!

వాషింగ్టన్ : భారతదేశ సరిహద్దుల్లో చైనా సైనిక సామర్థ్యం పెరుగుతోందని పెంటగాన్ హెచ్చరించింది. చైనా సైనిక దళాలు, స్థావరాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్నట్లు, ముఖ్యంగా పాకిస్థాన్‌లో బలపడుతున్నట్లు తెలిపింది. ప్రజా గణతంత్ర చైనాకు సంబంధించిన సైనిక, భద్రత పరిణామాలపై పెంటగాన్ 2016వ సంవత్సరానికి రూపొందించిన నివేదికను అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించింది. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో తూర్పు ఆసియా రక్షణ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అబ్రహాం ఎం. డెన్మార్క్ ఈ వివరాలు తెలిపారు.
చైనా వైఖరి వెనుకనున్న అసలు ఉద్దేశాన్ని చెప్పడం కష్టమని డెన్మార్క్ అన్నారు. టిబెట్‌లో చైనా సైనిక కమాండ్‌ను ఆధునీకరించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ అంతర్గత సుస్థిరతను కాపాడుకోవడానికి అంతర్గత పరిశీలనలు ఎంతవరకు దోహదం చేశాయో చెప్పడం కష్టమన్నారు. అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి ఆష్టన్ కార్టర్ ఇటీవల ఇండియాలో జరిపిన పర్యటన అత్యంత సానుకూల ఫలితాలను ఇచ్చిందన్నారు. భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకోవడం కొనసాగిస్తామన్నారు. దీనికి చైనాతో సంబంధం లేదన్నారు. ఇండియా సహజంగానే ముఖ్యమైన దేశమన్నారు. ఆ దేశానికి ఉన్న విలువ ఆధారంగానే సంబంధాలు ఏర్పరచుకుంటున్నట్లు తెలిపారు.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌లో చైనా స్థావరాలు, బలగాలు పెరుగుతున్నాయని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. పాకిస్థాన్‌తో చైనాకు దీర్ఘకాలిక స్నేహ సంబంధాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంది. అంతర్జాతీయంగా చైనా ఆర్థిక ప్రయోజనాలు విస్తరిస్తుండటంతో సుదూర సముద్రాల్లో చైనా నావికాదళం సేవలు అవసరమనే డిమాండ్ పెరుగుతున్నట్లు తెలిపింది.

51463212994_625x300