భారత్‌లో కొత్త స్ట్రేయిన్‌ కేసులుఏ 73

దిల్లీ,జనవరి 6(జనంసాక్షి): దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మరో రెండు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 73కి పెరిగింది. నిన్న సాయంత్రానికి 13 కొత్త కేసులు రావడంతో 71గా ఉన్న ఈ సంఖ్య తాజాగా మరో రెండు కేసులు రావడంతో 73కి పెరిగింది. దేశంలో సాధారణ కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో బ్రిటన్‌ నుంచి వచ్చిన ఈ కొత్త స్ట్రెయిన్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. తొలుత యూకేలో వెలుగుచూసిన ఈ వైరస్‌ త్వరితంగా వ్యాప్తి చెందుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటివరకు ఈ వైరస్‌ 41 దేశాలకు వ్యాపించినట్టు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. కొత్త రకం కరోనా బారినపడిన వారితో ప్రయాణించినవారు, కుటుంబ సభ్యులు, ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.