భారత్ తజకిస్తాన్ పరస్పర సహకారం
– సైనిక ఆసుపత్రిని సందర్శించిన మోదీ
హైదరాబాద్ జూలై 13 (జనంసాక్షి):
భారత్, తజికిస్తాన్ మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతమవుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తజికిస్తాన్ అధ్యక్షుడు ఇమామ్ అలీ రెహ్మాన్ తో సమావేశం తర్వాత ప్రధాని విూడియాతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య మంచి చారిత్రక, సాంస్కృతిక సంబంధాలున్నాయని గుర్తుచేశారు. షాంఘై సహకార సంస్థలో భారత్ కు సభ్యత్వం లభించడం? భారత్, తజికిస్తాన్ సంబంధాలు మెరుగుపడటానికి దోహదపడుతుందన్నారు. భేటీలో ఆర్థిక, వాణిజ్య, రక్షణ రంగాలకు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చాయని మోడీ చెప్పారు. ఉగ్రవాద నిర్మూలనకు కలిసి పనిచేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. అంతర్జాతీయ నార్త్, సౌత్ కారిడార్ నిర్మాణానికి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని ప్రధాని మోడీ వెల్లడించారు.
భారత్- తజికిస్థాన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న క్షేత్ర సైనిక ఆస్పత్రిని భారత ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని అక్కడ అందిస్తున్న పలు సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికులు, అధికారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీకి సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు.