భీంగల్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు

*ఇంచార్జ్ పాలనలో మున్సిపల్ కమిషనర్ *కుంటుబడుతున్న అభివృద్ధి*వేల్పూర్ తహసీల్దార్ కు ఇంచార్జ్ ఇవ్వడం పలు అనుమానాలకు  దారితీస్తున్న వైనం                      భీంగల్ ప్రతినిధి(జనంసాక్షి):భీంగల్ మున్సిపల్ పరిధిలో వేల్పూర్ రోడ్ లో,బాపూజీ నగర్ కాలనీలో జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. భీంగల్ మున్సిపల్ కమిషనర్ గా గోపు గంగాధర్ మూడు సంవత్సరాలుగా విధులు నిర్వహించి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంలో తో అధికార పార్టీ నాయకులు ఇక్కడ నుండి బదిలీ చేయించారు.ఆయన బదిలీ కాగానే భీంగల్ తహశీల్దార్ రాజేందర్ కు  మున్సిపల్ కమిషనర్ గా ఇంచార్జీ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో లను తీసేయడంతో ఇప్పటికే తహసీల్దార్ లకు పనిభారం పెరిగింది.దీంతో భీంగల్ మున్సిపల్ లో క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడంతో అభివృద్ధి కుంటుబడుతుంది.జనన మరణ ధ్రువీకరణ కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నమని రోజుల తరబడి ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుందని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. భీంగల్ తహశీల్దార్ రాజేందర్ మూడు నెలల క్రితం వేల్పూర్ మండల తహసీల్దార్ గా బదిలీ అయ్యారు. భీంగల్ తహసీల్దార్ గా శ్రీధర్ బదిలీపై వచ్చారు. భీంగల్ మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ గా తహసీల్దార్ శ్రీధర్ కు ఇవ్వకుండా, ఇప్పటికీ భీంగల్ మున్సిపల్ కమిషనర్ గా వేల్పూర్ తహసీల్దార్ రాజేందర్ కొనసాగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంతకాల కోసం ఫైళ్ళు అన్ని ఎత్తుకుని ప్రతిసారి వేల్పూర్ పోవడం ఇబ్బంది అవుతుందని మున్సిపల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి భీంగల్ మున్సిపల్ కమిషనర్ బాధ్యతలు తహసీల్దార్ కు కాకుండా రెగ్యులర్ కమిషనర్ ను నియమించాలని భీంగల్ ప్రజలు కోరుతున్నారు.