మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి

ఉదయం నుంచే మండుతున్న సూరీడు
విజయవాడ,మే18(జ‌నంసాక్షి): రోహిణీ కార్తె దగ్గర పడుతున్న కొద్దీ ఎండలు ముదురుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు జిల్లాను అగ్నిగుండంగా మారుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ముఖ్యపట్టణాల్లో 40 నుండి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం విశేషం. నిప్పులు కురిపిస్తున్న సూరీడి ధాటికి ప్రజలు  తాళలేకపోతున్నారు. మండుటెండలకు రోడ్ల విూదకు వచ్చే పరిస్థితికి కనిపించడం లేదు. ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు జిల్లా అంతటా కర్ఫ్యూ వాతావరణం నెలకొంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నమోదవుతున్న
ఉష్ణోగ్రతలకు ప్రజలు భీతిల్లుతున్నారు. వృద్ధులు, చిన్నారులను వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రానున్న రోజుల్లో 48డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రాత్రి 10గంటలు దాటినా వడగాడ్పులు ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో సముద్ర తీర ప్రాంతాల్లో సాయంత్రం పూట గాడ్పులు తగ్గి చల్లగాలి వీచేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. సముద్రానికి అనుకున్న గ్రామాల్లో సైతం వడగాడ్పులు ఏ మాత్రం తగ్గడం లేదు.అత్యధికంగా  46 డిగ్రీలు నమోదైంది. ఉదయం 6గంటల నుండే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో  మోదవుతున్నాయి.