మంత్రిగారికి ట్వీట్‌.. 20 నిమిషాల్లో సహాయం

న్యూదిల్లీ: ట్విట్టర్‌ ద్వారా సమస్య తెలియజేస్తే రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆపదలో ఉన్న ఓ ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించి 20 నిమిషాల్లో సహాయం అందించింది.

దిల్లీ నుంచి వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న రైలులో బిభుటి అనే ప్రయాణికుడి ఆరేళ్ల కుమారుడు పైబెర్త్‌ నుంచి కిందపడడంతో తల కు తీవ్రగాయమైంది. దీంతో బిభుటి రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు, రైల్వే మంత్రిత్వశాఖను ట్విట్టర్‌ ద్వారా సహాయం కోరాడు. 20 నిమిషాల్లో రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించి బిభుటి ఫోన్‌ నెంబరు తీసుకొని రైలు లూథియానా స్టేషన్‌కు రాగానే బాలుడిడికి వైద్య సహాయం అందించారు. దీంతో బిభుటి సురేశ్‌ ప్రభు, రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రైల్వే శాఖ ట్వీట్‌ ఆధారంగా సహాయం చేసిన ఘటనలు చాలా ఉన్నాయి.