మంత్రులను అడ్డుకున్న సిర్పూర్‌ కాగితం మిల్లు కార్మికులు

అదిలాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): సిర్పూర్‌ కాగితం మిల్లును తెరిచి కార్మికులను ఆదుకోవాలంటూ కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలను కార్మికులు అడ్డుకున్నారు. మంత్రుల ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాజమాన్యం షట్‌డౌన్‌ పేరుతో మిల్లును మూతవేసి కార్మికులకు వేతనాలు చెల్లించటం లేదన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కడియం మాట్లాడుతూ ప్రభుత్వ కార్యదర్శి, ¬ంమంత్రి నాయని నర్శింహారెడ్డితో ఈ విషయంపై చర్చించి కార్మికులకు న్యాయం చేస్తామంటూ భరోసా ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి, మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌ మండలం గన్నారంలోని 21వ శాతాబ్దపు గురుకులం సముదాయాలను పరిశీలించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రులు ఎపి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చారు.