మంత్రులు రాజీనామా చేశాకే చర్చ
– పట్టువీడని విపక్షాలు
– నేటికి లోక్సభ వాయిదా
న్యూఢిల్లీ,జులై23(జనంసాక్షి):
మూడోరోజూ పార్లమెంట్ ఉభయ సభలను లలిత్మోదీ, వ్యాపమ్ కుంభకోణం వ్యవహారం కుదిపింది. కేంద్రమంత్రి, మధ్యప్రదేశ్ సీఎం రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలు రద్దుచేసి లలిత్మోదీ వ్యవహారంపై చర్చించాలని పట్టుబట్టారు. విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయసభలు అట్టుడికాయి. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే,విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో లోక్సభ శుక్రవారానికి, రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే లలిత్మోదీ అంశం, వ్యాపం కుంభకోణంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించరాదని స్పీకర్ సుమిత్ర పదేపదే విజ్ఞప్తి చేసినా విపక్షాలు వినిపించుకోలేదు. ప్లపకార్డులు ప్రదర్శించొద్దని స్పీకర్ సుమిత్రా మహాజన్ వారించినా సభ్యులు పట్టించుకోలేదు. దీంతో తొలుత స్పీకర్ సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్ష సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్షాల ఆందోళనతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, భాజపాకి చెందిన రాజస్థాన్ సీఎం వసుంధర రాజె, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ ల్మహాన్లు రాజీనామా చేసితీరాలని విపక్షాలన్నీ గట్టిగా పట్టుపట్టడంతో గురువారం కూడా పార్లమెంటు కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వాదోపవాదాల నడుమ మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ వాయిదా పడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వీడాలనీ, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ముక్తకంఠంతో నినదించాయి. చర్చను చేపడదామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు ససేమిరా అన్నాయి. వివాదాస్పదుడైన లలిత్మోదీకి సహకరించిన ఆరోపణలపై సుష్మ, వసుంధర; వ్యాపం కుంభకోణంలో చౌహాన్ రాజీనామాలు చేయాలనీ, లేదంటే వారిపై వేటు వేయాలని రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో వరసగా మూడోరోజు కూడా కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాజీనామాలు లేనిదే ఎలాంటి చర్చ చేపట్టేది లేదని కాంగ్రెస్, బీఎస్పీ, వామపక్ష పార్టీల సభ్యులు తేల్చి చెప్పేశారు. లలిత్మోదీ అంశం, వ్యాపం కుంభకోణంపై చర్చకు తాము నోటీసులిచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. గురువారం ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాగా లలిత్ మోదీ, వ్యాపమ్ కుంభకోణంపై చర్చ జరపాలంటూ నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించవద్దంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించినప్పటికీ సభ్యులు వెనక్కి
తగ్గకపోవడంతో సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు, ఆ తర్వాత రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో డిప్యూటీ చైర్మన్ సభను తొలుత గంటపాటు, ఆ తర్వాత మధ్యాహ్నం రెండుగంటలకు వాయిదా వేశారు.లలిత్ మోదీ వ్యవహారంపై రాజ్యసభలో ప్రకంపనలు కొనసాగాయి. కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే కేంద్ర మంత్రి రాజీనామా తన పరిధిలో లేదని డిప్యూటీ చైర్మెన్ కురియన్ స్పష్టం చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటీసులో కేంద్ర మంత్రి రాజీనామా కోరలేదన్నారు. సిపిఎం ఎంపీ సీతారాం ఏచూరి మాట్లాడుతూ కేంద్ర మంత్రిపై చర్యలు తీసుకున్నాకే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.