మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం

లైంగిక వేధింపుల కేసులో వ్యక్తి దారుణం

యువతిని ఈడ్చుకొచ్చి హత్య చేసిన దుండగుడు

భోపాల్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): తనపై పెట్టిన లైంగిక కేసును ఉపసంహరించుకోనందుకు 23 ఏళ్ల దళిత యువతిని ఓ వ్యక్తి హత్య చేశాడు. యువతి జుట్లు పట్టుకుని కాలేజీ నుంచి బయటకు ఈడ్చుకువచ్చి, అనంతరం తలపై బలమైన ఆయుధంతో కొట్టి చంపాడు. మధ్య ప్రదేశ్‌లోని సివనిలో జరిగిందీ సంఘటన.రాష్ట్ర రాజధానికి 350 కిలోవిూటర్ల దూరంలో ఉన్న సివని పట్టణంలోని నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రభుత్వ మహిళా కాలేజీలో యువతి చదువుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే అనిల్‌ మిశ్రా (38) అనే యువకుడు తనపై లైంగిక హింసకు పాల్పడ్డాడని పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ కేసునుఉపసంహరించుకోవాలని, లేదంటే చంపేస్తానంటూ అనిల్‌ చాలా సార్లు బెదిరింపులు చేశాడు. యువతి మాత్రం కేసును ఉపసంహరించుకోవడానికి ససేమిరా అంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అనిల్‌.. యువతి జుట్టుపట్టుకుని కాలేజీ బయటికి తీసుకువచ్చిన అనిల్‌.. తన వెంట తెచ్చుకున్న మరణాయుధంతో బహిరంగంగానే యువతిని తీవ్రంగా కొట్టాడు. కొంతమంది అనిల్‌ను ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఏం లాభం లేకపోయింది. తీవ్రంగా గాయపడ్డ యువతి, ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించింది. అనంతరం పోలీసుల కస్టడీలో అనిల్‌ తన నేరాన్ని అంగీకరించాడు.