మమతా మతిస్థిమితం కోల్పోయారు
భాజపా పశ్చిమ్ బంగ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మమతా బెనర్జీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. తమ పార్టీ అధినేత గురించి గూండాల తరహా భాష వాడారని ఆరోపిస్తూ, తాము దాన్ని తేలిగ్గా తీసుకోబోవడం లేదన్నారు. ఘోష్ వ్యాఖ్యలను, ఉపయోగించిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని తృణమూల్ కాంగ్రెస్ సెక్రెటరీ జనరల్ పార్థా చటర్జీ అన్నారు. పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ మమతా బెనర్జీ చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని, ఆమెను ఎవరూ ఆపలేరని ఆయన పేర్కొన్నారు. మిడ్నపూర్ జిల్లాలో పార్టీ యూత్వింగ్ సమావేశంలో మాట్లాడుతూ భాజపా నేత దిలీప్ ఘోష్ నోట్ల రద్దు తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మతిస్థిమితం కోల్పోయారని, అందుకే ఆమె దిల్లీ, పట్నా తిరుగుతున్నారని అన్నారు. ఏంచేయాలో తెలియక ఆమె సెక్రెటేరియట్లో ఉండిపోయారని, ఒక దశలో ఆమె గంగలో దూకుతారేమోననుకున్నామని అన్నారు. ఈ నెల మొదటివారంలోనూ ఆయన మరో సమావేశంలో మాట్లాడుతూ ‘మమత దిల్లీ వెళ్లి ఆడి, పాడారు. అక్కడ మా ప్రభుత్వం ఉంది. తలచుకుంటే ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చి అవతల పడేసేవాళ్లం కాదా’ అంటూ వ్యాఖ్యానించారు.