మరింత అప్రమత్తత అవసరం
` ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించాలి
` వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉంది
` కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారం సేకరించాలి
` సహాయ బృందాలతో సమన్వయం చేసుకోవాలి
` అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
` వర్ష నష్టాలు జరక్కుండా చూడండి
` కల్వర్టుల, కాజ్వేల వద్ద అప్రమత్తంగా ఉండండి
` ఆర్ అండ్ బి అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం
హైదరాబాద్(జనంసాక్షి):భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. జగిత్యాల మినహా 15 జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని సీఎం తెలిపారు. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం ఉన్నతాధికారులతో మాట్లాడారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించామని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతారని సీఎం తెలిపారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు- ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలని…. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సవిూపంలో బారికేడ్లు ఏర్పాటు- చేసి పర్యవేక్షణ చేయాలన్నారు. నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటు-వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ తగినంత మందులు అందుబాటు-లో ఉంచుకోవాలని… అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం,పశునష్టం చోటుచేసు కోకుండా జాగ్రత్తలు వహించాలని సీఎం తెలిపారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పురపాలక, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాగాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
వర్ష నష్టాలు జరక్కుండా చూడండి:మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆర్అండ్బీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. అధిక వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, వంతెనల వివరాలపై ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సవిూక్షించారు. వరద ప్రవాహాలకు రాష్ట్ర వ్యాప్తంగా 454 చోట్ల ఆర్ అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 629 కిలో విూటర్లు రోడ్డు దెబ్బతిన్నట్లు- అధికారులు నివేదిక ఇచ్చినట్లు- చెప్పారు. రోడ్ల మరమ్మత్తులపై పనులు ప్రారంభించినట్లు- పేర్కొన్నారు. గత ప్రభుత్వం వేసిన నాణ్యతా రహిత రోడ్ల వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పాడ్డాయని ఆరోపించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రోడ్ల డ్యామేజీపై అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..భారీ వర్షాల కారణంగా 22 చోట్ల రోడ్లు తెగిపోతే వెంటనే 4 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేసినట్లు- మంత్రి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. 171 చోట్లలో ఇంకా కాజ్ వే, కల్వర్టులు వద్ద వరద ప్రవాహం ఉన్నట్లు- పేర్కొన్నారు. 108 రాకపోకలకు ఇబ్బంది ఉన్న ప్రాంతాలను గుర్తించినట్లు- చెప్పారు. 71 చోట్ల క్లియర్ చేయగా.. మిగతా చోట్ల సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు- వివరించారు. వాగుల వెంట 58 కి.విూ రోడ్డు కోతకు గురైందని, అందులో 378 విూటర్లు రోడ్డును ప్రభుత్వం మూసివేసిందని తెలిపారు. మొత్తంగా 147 చోట్లలో కాజ్ వే, మైనర్ బ్రిడ్జిలు, కల్వర్టులు తాత్కాలికంగా, శాశ్వతంగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు- వెల్లడిరచారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అవసరమైతే తప్ప రావొద్దని మంత్రి సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు కల్వర్టులు, లో లెవెల్ వంతెనలు, కాజ్ వేల వద్ద ఇంజినీర్లు విధిగా తరచూ క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలన్నారు. ప్రాణనష్టం జరగకుండా ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలన్నారు. అందుకు పోలీస్, విద్యుత్, రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీ రాజ్ శాఖల విభాగాలతో ఆర్ అండ్ బీ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రజా రవాణాకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తెగిన రోడ్లు, కల్వర్టులు వద్ద తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని, క్షేత్ర స్థాయి పరిస్థితులు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు.