మరిన్ని చిక్కుల్లో ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌..!

– కేజీవ్రాల్‌ ఇంట్లో సీసీ ఫుటేజ్‌లు మార్చినట్లు పోలీసుల అనుమానం
– ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబోరేటరీకి పరీక్షలకోసం పంపిన అధికారులు
న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కొట్టిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కేజీవ్రాల్‌ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఆ ఫుటేజ్‌ను మార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో దానిని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పరీక్షల కోసం పంపించారు. ఢిల్లీ సీఎం, సీఎస్‌ విూటింగ్‌ కేజీవ్రాల్‌ ఇంట్లోని డ్రాయింగ్‌ రూమ్‌లో జరిగినట్లు అడిషనల్‌ డీసీపీ హరేంద్ర సింగ్‌ కోర్టుకు తెలిపారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. సమయంలో మార్పు ఉండటం గమనించినట్లు ఆయన చెప్పారు. ఈ నెల 19న రాత్రి సీఎస్‌ కేజీవ్రాల్‌ ఇంటికి వెళ్లారు. అక్కడున్న ఆప్‌ ఎమ్మెల్యేలు తనపై దాడి చేసినట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి విచారణ మొదలుపెట్టిన ఢిల్లీ పోలీసులు.. గత శుక్రవారం కేజీవ్రాల్‌ ఇంటికి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్‌కు సంబంధించిన హార్డ్‌ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిజానికి ఆ హార్డ్‌డిస్క్‌ను ఇవ్వాల్సిందిగా కోరినా.. పట్టించుకోకపోవడంతో పోలీసులే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. మొత్తం 21 సీసీటీవీ కెమెరాలు, హార్డ్‌డిస్క్‌ను పోలీసులు పరిశీలించారు. ఈ ఘటన జరిగినప్పుడు 14 కెమెరాలు పని చేస్తుండగా.. ఏడు పనిచేయడం లేనట్లు గుర్తించారు. ఈ ఘటన జరిగిన రూమ్‌లో కెమెరా లేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటన ఈ నెల 19 అర్ధరాత్రి తర్వాత జరిగినట్లు వాళ్లు తెలిపారు.