మరోమారు సర్జికల్‌ దాడులకు వెనకాడం: ఆర్మీ హెచ్చరిక

జమ్మూ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): పాక్‌ తీవ్రవాదానికి ఊతమిస్తూ అమాయకప్రజల ప్రాణాలను బలిగొంటోందని, అవసరమైతే మరోమారు సరిహద్దు రేఖ దాటి దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్‌ ఆర్మీ పేర్కొన్నది. శత్రువులపై దాడి చేసేందుకు తాము ఎల్వోసీ దాటేందుకు కూడా వెనుకాడబోమని నార్తర్న్‌ కమాండ్‌కు చెందిన లెఫ్టినెంట్‌ జనరల్‌ డీ అంబూ తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్జికల్‌ దాడులను ఆయన సమర్థించారు. శత్రువులను తరిమేందుకు ఆ దాడి అవసరమైందని, ఉగ్ర మూకలను ఎదుర్కొనే అంశంలో తాము ఎల్వోసీని ఉల్లంఘించేందుకు వెనక్కి తగ్గమన్నారు. కశ్మీర్‌లో కీలకమైన పిర్‌ పంజల్‌ సవిూపంలో ఉగ్ర క్యాంపులు, ల్యాంచ్‌ ప్యాడ్‌లు ఉన్నాయని, వాళ్లను తరిమేందుకు సర్జికల్‌ దాడులు అవసరమన్నారు. ప్రతి ఏడాది ఉగ్రవాదులు అనేక సార్లు చొరబాటు ప్రయత్నాలు చేస్తుంటారని, కానీ అందులో సక్సెస్‌ అయ్యేది తక్కువే అన్నారు. కశ్మీర్‌ వ్యాలీలోకి అక్రమంగా చొరబడాలనుకుంటున్న ఉగ్రవాదులను మన సైనికులు ధైర్యంగా అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు.