మరోసారి గవర్నర్తో సమావేశమైన పన్నీర్సెల్వం
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో సీఎం పళనిస్వామి నెగ్గడంతో పన్నీర్సెల్వం వర్గం తమ వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి బలపరీక్ష కోసం శనివారం ఉదయం సమావేశమైన అసెంబ్లీ రణరంగమైన విషయం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సభ్యులు సభలో విధ్వంసం సృష్టించారు. రహస్య ఓటింగ్కు డిమాండ్ చేస్తూ సభాపతిపై కాగితాలు విసిరారు. ఈ క్రమంలో స్పీకర్ ధనపాల్, విపక్ష నేత స్టాలిన్ చొక్కాలు కూడా చిరిగాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పళనిస్వామి బలపరీక్షలో నెగ్గిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత డీఎంకే సభ్యులు గవర్నర్ను కలవడం, ఆ తర్వాత మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద స్టాలిన్ నిరాహార దీక్షకు దిగడం, దాన్ని పోలీసులు భగ్నం చేయడం లాంటి ఘటనలతో శనివారం రాత్రి వరకు తమిళనాట రాజకీయాల్లో హైడ్రామా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ఇంఛార్జి గవర్నర్ విద్యాసాగర్రావుతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో మరోసారి బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరారు.